కామారెడ్డి, జనవరి 30 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు -మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్కు దీటుగా అభివృద్ధి చెందాయని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. సోమవారం ఆయన కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ.2.77 కోట్లతో నిర్మించిన వాటర్ ట్యాంకు, కోటి రూపాయలతో పూర్తిచేసిన బీటీ రోడ్డు, జడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.44 లక్షలు, ప్రైమరీ పాఠశాలలో రూ.11 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణంలో పలు అభివృద్ధి పనులు జరిగినట్లు తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలో ఉండే సౌకర్యాలకు మించి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించినట్లు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నిట్టు వేణుగోపాల్ రావు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందూప్రియ, కౌన్సిలర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.