ఎల్లారెడ్డి రూరల్, డిసెంబర్ 8 : రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తుల వారికి చేయుతనిస్తూ ఆర్థికంగా ఎదగడానికి ఎంతో కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని పెద్దచెరువులో గురువారం ఆయన చేప పిల్లలు, రొయ్యలను విడుదల చేశారు. అనంతరం చెరువుకట్టవద్ద గంగపుత్రులు, ముదిరాజ్ కులస్తులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చేపపిల్లలు వదలగానే పని అయిపోలేదని, వాటికి కావాల్సిన ఫీడింగ్ కూడా ప్రభుత్వం ఇస్తున్నదని అన్నారు.
చేపపిల్లలు విడుదల చేసిన నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి చేపపిల్లల ఎదుగుదలను మత్స్యకార్మికులు పరిశీలిస్తుండాలన్నారు. చేపపిల్లలు ఎంత ఎదిగి దిగుబడి వస్తే అంత లాభం వస్తుందన్నారు. మత్స్యకార్మికులనే కాకుండా మిగతా కులవృత్తులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తున్నదని తెలిపారు. మత్స్యకార్మికులు మరణిస్తే వారి కుటుం బాలకు రూ.5 లక్షలను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ప్రస్తుతం ఆయా పార్టీలు గ్రామాలకు వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల మధ్య గొడవలు పెడుతున్నాయని విమర్శించారు.
బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దేవుడు గుర్తుకువచ్చిండా, అంతకుముందు మనకు దేవుడు లేడా, మనం పూజలు చేయలేదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో పండించిన పంటను కొనలేని కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం మన రాష్ట్రంలో పండిన ధాన్యమే దిక్కయిందన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడిన మత్స్యకార్మిక సంఘాలకు ఆయన ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. సమావేశంలో ఆర్డీవో శ్రీను, జడ్పీటీసీ ఉషాగౌడ్, జిల్లా ఫిషరీస్ అధికారి వరదారెడ్డి, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు జలంధర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీశ్కుమార్, నాయకులు కాశీ నారాయణ, శ్రావణ్కుమార్, జంగం నీలకంఠం అప్ప, ఎరుకల సాయి లు, సంగని పోశయ్య, అల్లం శ్రీను, చింతల శంకర్, గంగారెడ్డి, మామిడి దామోదర్, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ తదితరులు పాల్గొన్నారు.