ఎల్లారెడ్డి రూరల్/బాన్సువాడ, మే 2: ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీజీఈ జేఏసీ జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కాలయాపన చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. శనివారం ఆయన ఎల్లారెడ్డి, బాన్సు వాడలో విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు.
ఈ నేపథ్యంలో టీజీఈ జేఏసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 5న కామారెడ్డి జిల్లా కేంద్రం లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. మొ త్తం 64 డిమాండ్లలోని ప్రధానమైన నాలుగు డిమాండ్లను మాత్రమే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్న ట్లు తెలిపారు. ఫిట్మెంట్ ప్రకటించే వరకూ పోరాడుతామని స్పష్టం చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బెన్ఫిట్స్ ఇప్పటివరకు విడుదల చేయకపోవడం బా ధాకరమన్నారు. రిటైర్డ్ అయిన వారికి, చనిపోయిన వారికి ఇప్పటి వరకు పెన్షన్ రావడంలేదని పేర్కొన్నారు.
ఉద్యోగస్తులకు పెన్షన్ తొలగించారని, ఉద్యోగులకు అక్కరలేని పెన్షన్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. వారికి ఇచ్చే పెన్షన్ను కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో అధికారంలోకి వస్తే ఓపీఎస్ను అమలుచేస్తామని, పీఆర్సీ ప్రకటిస్తామని, పెండింగ్ బిల్లులు ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటివరకు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు.