ఖలీల్వాడీ, మార్చి 4 : యువతకు ఉపాధి కల్పనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఐటీ హబ్ ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు. నిజామాబాద్లో రూ. 50 కోట్లతో నిర్మిస్తున్న ఐటీహబ్ భవన సముదాయాన్ని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కన్వీనర్ బిగాల మహేశ్గుప్తాతో కలిసి శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఐటీహబ్ వెబ్సైట్ను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఇందూరులో పరిశ్రమల అభివృద్ధికి ఐటీ హబ్ ఒక ఆరంభం లాంటిదని పేర్కొన్నారు.
జిల్లాకు ఇంకా ఎన్నో పరిశ్రమలు రానున్నాయని తెలిపారు. ఐటీ హబ్ నిర్మాణంపై ఎంతో శ్రద్ధ తీసుకున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా చేపట్టిన ఐటీ హబ్ పనులు తుది దశకు చేరుకున్నాయని, అతి త్వరలో కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. ఇతర జిల్లాల్లోని ఐటీహబ్లను పరిశీలించి, లోటుపాట్లను సరిదిద్ది నిజామాబాద్ ఐటీ హబ్ను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే 250కి పైగా కంపెనీలతో ఒప్పందం జరిగినట్లు తెలిపారు. మూడు నుంచి నాలుగు వేల మంది స్థానికులకు అవకాశం కల్పించి మరింత విస్తృతం చేస్తామన్నారు.
దేశంలో ఐటీ ఎక్స్పోర్ట్లో మన రాష్ట్రం రెండో స్థానంలో ఉన్నదని తెలిపారు. తెలంగాణలో కలలు కన్న ప్రగతి సాధ్యమవుతుందన్నారు. భవిష్యత్తు ప్రణాళికతో నిర్మాణం చేపట్టిన ఎమ్మెల్యే గణేశ్గుప్తా, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కన్వీనర్ బిగాల మహేశ్గుప్తాను అభినందించారు. డిగ్రీ కళాశాలలతో ఒప్పందాలు కుదుర్చుకుంటామని, మరింత అభివృద్ధి సాధించేందుకు ముందుకెళ్తామన్నారు. జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఎమ్మెల్సీ తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.