గాంధారి, మార్చి 29 : ఆ ఆలయంలో వందల ఏండ్లుగా అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంది. కోరిన కోర్కెలు తీర్చే అంజన్నగా కీర్తికెక్కిన ఆలయానికి 500 ఏండ్ల చరిత్ర ఉన్నది. ఊరంతా ఒక్కటై శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహించడం మరో ప్రత్యేకత. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గౌరారం గ్రామంలోని మహిమగల దేవుడిగా శ్రీరామాంజనేయ స్వామి పూజలందుకుంటున్నాడు. శ్రీరామనవమి వచ్చిందంటే 9 రోజుల పాటు గ్రామస్తులంతా కలిసి ఉత్సవాలను నిర్వహిస్తారు. కులాలకతీతంగా చిన్నాపెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ శ్రీరాముని సేవలో మునిగిపోతారు.
ఆలయ ప్రత్యేకతలు…
గౌరారం గ్రామంలో కొలువై ఉన్న శ్రీరామాంజనేయ ఆలయం శాలివాహన కాలంలో నిర్మించినట్లు ఆలయ నిర్మాణ శైలిని బట్టి తెలుస్తున్నది. ఈ ఆలయం పూర్తిగా రాతి స్తంభాలతో నిర్మించడంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఆలయంలోని ఆంజనేయస్వామి విగ్రహానికి ఎక్కడా లేని విధంగా హృదయంలో సీతారామలక్ష్మణులు ఉంటారు. ఆలయంలోని అఖండ జ్యోతి దాదాపు 500 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా వెలుగుతూనే ఉన్నదని గ్రామస్తులు తెలిపారు. ఆలయానికి పడమర వైపున కొనేరు, దాని పక్కనే ఉన్న పెద్ద రావిచెట్టు చూపరులను ఆకట్టుకుంటున్నది. ఎక్కడైనా రథోత్సవం సందర్భంగా రథాన్ని జరపాలంటే కుంభం ఉంటుంది, ఈ ఆలయంలోని రథాన్ని మాత్రం ఎక్కడా లేని విధంగా కొబ్బరి కాయ కొట్టి రథాన్ని ముందుకు జరుపుతారు.
తొమ్మిది రోజులు నిష్టగా..
శ్రీరామ నవమిని వచ్చిందంటే గ్రామస్తులంతా తమ ఇండ్లను శుభ్రం చేసుకొని సున్నాలు వేసుకుంటారు. తొమ్మిది రోజుల పాటు మాంసం, మద్యాన్ని ముట్టకుండా నియమనిష్టలతో ఉంటారు. శ్రీరామ నవమి రోజున ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని వేదపండితుల ఆధ్వర్యంలో ఘనంగా జరిపిస్తారు.
18 కులాల ఆధ్వర్యంలో ఉత్సవాలు..
శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఎక్కడా లేని విధంగా గౌరారం గ్రామంలో తరతరాలుగా వస్తు న్న ఆనవాయితీ ప్రకారం ఆలయంలో నిర్వహించే కార్యక్రమాల్లో గ్రామంలోని 18 కులాల వారు ప్రధాన పాత్ర పోషిస్తారు. గ్రామంలో ఆలయానికి సంబంధించి రథాన్ని తయారు చేయడానికి చాకలివారు కట్టెలు తీసుకువస్తే, వడ్ల, కమ్మరులు రథాన్ని బిగిస్తారు, పద్మశాలీలు కొత్త వస్త్రాలతో రథాన్ని అందంగా ముస్తాబు చేస్తారు. ముదిరాజ్లు, కాపులు, గొల్లవారు ఆలయంలో వంటలను వండుతారు. వైశ్యులు అన్నదానానికి అవసరమైన వస్తువులు, సామగ్రిని సమకూరుస్తారు. బెస్తవారు ఆలయంలోని పరిసరాలను శుభ్రం చేస్తారు. వీరితో పాటు ఇతర కులస్తులు తమకు తోచిన విధంగా సేవచేస్తూ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ విధంగా గ్రామంలోని అన్ని కులాల వారు ఏకమై కలిసికట్టుగా రామ నవమిని ఘనంగా నిర్వహిస్తారు. ఇలాంటి సంప్రదాయం మరెక్కడా కనిపించదు.