కోటగిరి, డిసెంబర్ 25: బాలికలకు స్వేచ్ఛ, సమానత్వం, హక్కుల గురించి తెలియడమే కాకుండా సమాజంలో వారికి ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా చేపడుతున్న బాలికా సాధికారత కార్యక్రమాలు ఎంతో దోహదపడుతున్నాయి. బాలికల్లో చైతన్యం, ఆత్మైస్థెర్యాన్ని నింపుతున్నాయి. ప్రాథమికోన్నత స్థాయి నుంచే ఆడపిల్లలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది తిరిగి కమిటీలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. లింగ వివక్ష, హింస, వేధింపులు తదితర అంశాలపై బాలికలను అప్రమత్తం చేసేలా కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి జిల్లాకు వందకు పైగా పాఠశాలల్లో బాలికలతో కమిటీలను రూపొందిస్తున్నారు.
విద్యార్థులతోనే బాలల కమిటీలను ఏర్పా టు చేస్తున్నారు. ఇందులో ప్రతి తరగతి నుంచి ఇద్దరు విద్యార్థినులతోపాటు ఒక ఉపాధ్యాయిని, షీ టీం సిబ్బంది సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి ప్రధానోపాధ్యాయుడు చైర్మన్గా వ్యవహరిస్తారు. క్లిష్ట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవడం, ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగడంతోపా టు బాలికలను ఉన్నతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కమిటీలు పని చేస్తా యి. విద్యాశాఖ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలోని 353 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అధికారులు.. కమిటీలను నియమిస్తున్నారు. ఇప్పటికే చాలావరకు కమిటీల నియామకం పూర్తికాగా, అవగాహన కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. మిగితా విద్యాలయాల్లో సాధికారత కమిటీల ఏర్పాటు కొనసాగుతున్నది.
పాఠశాలల్లో డయల్ 100, 1098, 181 వంటి హెల్ప్లైన్ నంబర్లను నోటీస్ బోర్డుపై ఏర్పాటు చేశారు. బాల్య వివాహాలు, హింస, వేధింపులు వంటి అంశాలపై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. బాలికల ఎదుగుదలతోపాటు శారీరక మార్పులు, ఆరోగ్య సమస్యలు, శుభ్రతపై నిపుణులతో అవగాహన కల్పిస్తారు. దాడులను ఎలా ప్రతిఘటించాలో నేర్పుతారు. ఇప్పటికే ఎంపికచేసిన పాఠశాలల్లో ఆత్మరక్షణ కోసం శిక్షణ ఇస్తున్నారు.
జిల్లాలో ఎంపిక చేసిన 353 పాఠశాలల్లో బాలికా సాధికారత కమిటీలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ సూచించింది. వీటి ద్వారా బాలికల్లో ఆత్మైస్థెర్యం పెంపొందించేందుకు అవకాశం ఏర్పడతుంది. సమాజంలో బాలికలపై జరుగుతున్న దాడులను ఎలా ఎదుర్కోవాలో చైతన్య కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ఈ కమిటీ ద్వారా నిర్వహించే కార్యక్రమాలు బాలికలకు ఎంతో ఉపకరిస్తాయి.