కమ్మర్పల్లి, జూలై 23: రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి రూ. 30 లక్షల తన సొంత వ్యయంతో సమకూర్చిన అత్యవసర ప్రతిస్పందన అంబులెన్స్ బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు ఆపద్బాంధవిగా సేవలందిస్తున్నది. 2020 జూలై 24న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు గిఫ్ట్-ఎ-స్మైల్ పేరుతో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధునాతన హంగులు ఉన్న ఈ అంబులెన్స్ను అందించారు.
నియోజకవర్గ ప్రజలతోపాటు నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోనూ ఈ అంబులెన్స్ సేవలు అందాయి. కొవిడ్ సమయంలో ఎన్నో ప్రాణాలను నిలిపింది. ఇప్పటివరకు వేల మందికి ఆపత్కాలంలో సేవలందాయి. వందల సంఖ్యలో రోడ్డు ప్రమాద, అత్యవసర, అనారోగ్య వేళల్లో, వందల సంఖ్యలో గర్భిణులకు అవసరమైన సేవలు అందుతున్నాయి. బాల్కొండ నియోజకవర్గంలో ప్రభుత్వ దవాఖానలను తన మిత్రుల సహకారంతో రూ.కోటి 60 లక్షలతో ఆక్సిజన్ బెడ్ల దవాఖానలుగా మార్చిన మంత్రి వేముల అత్యవసర ప్రతిస్పందన అంబులెన్స్తో ప్రజలకు అండగా నిలుస్తున్నారు. గిఫ్ట్-ఎ-స్మైల్ కింద మంత్రి ఈ అంబులెన్స్ను అందించి నేటికి రెండేళ్లు అవుతోంది.