ఖలీల్వాడి, జనవరి 12 : సంక్రాంతి వచ్చిందటే ప్రతి ఇల్లూ పిండివంటలతో వారం రోజులపాటు సందడిగా కనిపిస్తుంది. ఒక్కో పండుగకు ఒక్కో ప్రత్యేక వంటకాలను తయారు చేసుకుంటారు. ఇందులో గేవర్ స్వీట్ సంక్రాంతి స్పెషల్. ఈ రాజస్థానీ వంటకాన్ని ఇంటివద్ద తయారు చేసుకోవడం కష్టమే. ఈ మిఠాయిని తినాలనుకునేవారికోసం రాజస్థాన్ నుంచి వచ్చిన కొందరు సంక్రాంతి సందర్భంగా గేవర్ను తయారుచేసి విక్రయిస్తున్నారు.నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గణేశ్ మందిరం వద్ద నిర్వహిస్తున్న హోటల్లో గత 40 ఏండ్లుగా రాజస్థానీ కుటుంబం గేవర్ స్వీట్ను తయారు చేస్తున్నది. ఈ మిఠాయిని 15 రోజులపాటు అందుబాటులో ఉంచుతామని హోటల్ నిర్వాహకుడు రాజు తెలిపారు. గేవర్ స్వీట్ కేవలం నిజామాబాద్ , హైదరాబాద్లోనే దొరుకుతుందని చెప్పాడు. గేవర్ ప్రియులు చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తారని తెలిపాడు. కాజూ, పిస్తా వంటి డ్రైప్రూట్స్తోపాటు నెయ్యితో చేసిన ఈ స్వీట్.. కిలో రూ.600కు విక్రయిస్తున్నట్లు చెప్పాడు. డాల్డతో తయారు చేసిన స్వీట్ రూ. 300కు అమ్ముతున్నామని తెలిపాడు.
జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగ అనగానే గుర్తుకు వచ్చేవి అప్పాలు, సకినాలు, అరిసెలు, చెగోడీలు, బొందీ లడ్డూలు,బెల్లం స్వీట్ల ఘుమఘుమలు. ఈ నేపథ్యంలో ఏ ఇంట్ల్లో చూసినా పిండివంటల తయారీలో మహిళలు బిజీగా కనిపిస్తున్నారు. కానీ, కొంతమంది మాత్రం రెడీమేడ్ వంటల వైపు మొగ్గు చూపుతున్నారు. పనుల్లో బిజీగా ఉండేవారు బయట తయారు చేయించుకుంటున్నారు. జిల్లాకేంద్రంలో సుభాష్ నగర్, ఎన్జీవోస్ కాలనీ తదితర ప్రాంతాల్లో పలువురు మహిళలు వీటిని తయారుచేసి విక్రయించి ఉపాధి పొందుతున్నారు. ఇంట్లో తయారు చేసుకోలేని వారు వీరివద్ద కొనుగోలు చేసి రుచి చూస్తున్నారు.
ప్రతి సంవత్సరం రెడీమేడ్ పిండి వంటకాలకు గిరాకీ ఎక్కువగా ఉం టుంది. సంక్రాంతి వచ్చిందంటే ఫుల్ గిరాకీ వస్తుంది. ఇంట్లో చేయనివారు, చేయలేని వారు మేము చేసే వంటలను కొనుగోలు చేస్తారు.
– మయూరి, రెడీమేడ్ పిండి వంటల యజమాని
మేము చేసే పిండి వంటలను కొనుగోలు చేసేందుకు ఎక్కడి నుంచో వస్తుంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గిరాకీ పెరిగింది. కొందరైతే ముందే ఆర్డర్ చేసి ప్రత్యేకంగా పిండి వంటలు చేయించుకుంటారు.
– మహానంద, నిజామాబాద్