నిజామాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ; గంజాయి రూపు మార్చుకుంటున్నది. గంజాయి ఎండు ఆకుల విక్రయం పాత పద్ధతి. గంజాయి చాక్లెట్లు, సిగరెట్లు వచ్చాయి. ఇప్పుడు సరికొత్తగా గంజాయిని నూనె రూపంలో విక్రయిస్తుండడం విస్తుగొల్పుతున్నది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పట్టుబడిన గంజాయి నూనెను చూసి పోలీసులు అవాక్కయ్యారు. గంజాయి స్మగ్లర్లు తమ వ్యాపారాన్ని గుట్టుగా వివిధ రకాలుగా సాగిస్తుంటారు. బానిసలుగా మారిన యువతను టార్గెట్గా చేసుకుని అక్రమంగా రూ.కోట్లు సంపాదిస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న గంజాయి వినియోగంతో స్మగ్లర్లు కొత్త దారులు వెతికి వాటిని సైప్లె చేస్తుండటం విస్మయం కలిగిస్తున్నది. గంజాయి నూనెను చిన్నపాటి డబ్బాలో పోసి విక్రయిస్తున్నారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా తేనె మాదిరిగా కనిపించే గంజాయిని సులువుగా విక్రయించేస్తున్నారు. ఇలా నూనె రూపంలో మార్చి విక్రయిస్తున్న ఓ ముఠా గుట్టును కామారెడ్డి దేవునిపల్లి పోలీసులు రట్టు చేశారు. చిన్నపాటి ప్లాస్టిక్ డబ్బాలో పోసి అమ్ముతున్న గంజాయి నూనెను ఎవ్వరూ గుర్తు పట్టకపోవడంతో ఇన్ని రోజులుగా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా వారి వ్యాపారం సాగింది. పోలీసుల రంగ ప్రవేశంతో గంజాయి నూనె రూపంలో కూడా లభిస్తుందన్న విషయం వెలుగు చూసింది.
సిగరేట్లలో కలిపి..
లిక్విడ్ గంజాయి లేదా గంజాయి నూనెను సిగరెట్లలో తంబాకుతో కలిపి యువత సేవిస్తున్నట్లు పోలీసుల పరిశోధనలో తేలింది. ఇంతకు ముందు ఎండు గంజాయిని సిగరేట్లలో నింపి పొగ తాగేవారు. అయితే, ఎండు గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు సులువుగా దొరికిపోతున్నట్లు గుర్తించిన అక్రమార్కులు.. రూట్ మార్చారు. గంజాయి నూనె ఆలోచనతో ఈ వ్యవహారానికి తెర లేపారు. గంజాయి నుంచి తీసిన నూనెను తంబాకుతో మిళితం చేసి సిగరేట్లలో నింపి పొగ లాగించేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వెలుగు చూసిన నూనె ఘటనతో ఉమ్మడి జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. సిగరేట్లు ఎక్కువగా విక్రయమయ్యే దుకాణాలపై నిఘా పెట్టారు. కళాశాలల వద్ద మఫ్టీలో నిఘా పెట్టి ఆకతాయిలపై దృష్టి పెట్టినట్లుగా తెలిసింది.
వెండి కన్నా ఎక్కువ ధర..
గంజాయి నూనె ధర చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. మార్కెట్లో ఈరోజు కిలో వెండి ధర రూ.78 వేలుగా ఉంది. అంటే వెండి ధర గ్రామునకు రూ.78 పలుకుతున్నది. అదే గంజాయి నూనె మాత్రం గ్రామునకు రూ.500 వరకు విలువ చేస్తుండటం విశేషం. కామారెడ్డి దేవునిపల్లి పోలీసులకు పట్టుబడిన 190 గ్రాముల నూనె విలు రూ.97,500లుగా నిర్ధారించారు. గుట్టలు, అటవీ ప్రాంతాల్లో అక్రమంగా గంజాయి మొక్కలను పెంచి వాటి ద్వారా నూనెను తీస్తున్నారు. పచ్చి మొక్కలతోనే నూనె తీస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్ పరిసర ప్రాంతాల్లో నూనెగా మార్చి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. అక్రమార్కులు రైళ్లు, కొరియర్ మార్గాల్లో గుట్టుగా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఈజీగా డబ్బులు సంపాదించాలనే దురాలోచనతో కొందరు యువకులు ఈ రొంపిలో దిగి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అంతర్రాష్ట్ర ముఠాలతో చేతులు కలిపి దందాలో పాత్రదారులుగా మిగులుతున్నారు.
జీవితాలు నాశనం చేసుకోవద్దు..
నమ్మదగిన సమాచారం మేరకు దేవునిపల్లి పీఎస్ పరిధిలో గంజాయి నూనెను పట్టుకున్నాం. గంజాయి అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తీసుకుంటాం. నిషేధిత గంజాయిని ఎవరైనా విక్రయిస్తే, వాడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. లేదంటే 100కు ఫోన్ చేసి చెప్పొచ్చు. యువత సన్మార్గంలో నడవాలి. జల్సాలకు అలవాటు పడి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దు. చెడు అలవాట్లతో యువత పక్కదారి పడుతోంది. తల్లిదండ్రులు వారి కదలికలపై నిఘా పెట్టి ఉంచాలి.
– శ్రీనివాస్, కామారెడ్డి రూరల్ సీఐ
కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామశివారులో గంజాయి ఆయిల్ను విక్రయిస్తున్న ఇద్దరిని, కొనుగోలు చేస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 14న క్యాసంపల్లి శివారులోని ఓపెన్ ప్లేస్లో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు దేవునిపల్లి ఎస్సై, సిబ్బంది దాడి చేసి ఏడుగురిని పట్టుకొని విచారించగా వారి వద్ద గంజాయి నుంచి తీసిన నూనె లభించింది. 190గ్రాముల గంజాయి నూనె విలువ సుమారు రూ.97,500 ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయి నూనెను ఇద్దరు వ్యక్తులు అరకు నుంచి తీసుకొచ్చి కామారెడ్డిలో విక్రయిస్తున్నారు. క్యాసంపల్లిలో ఐదుగురు యువకులకు గంజాయి నూనెను విక్రయిస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల నుంచి మూడు కార్లు, ఒక మోటార్ సైకిల్, రెండు స్కూటీలు, ఏడు మొబైల్స్ను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించామన్నారు. ఆపరేషన్లో పాల్గొన్న కామారెడ్డి రూరల్ ఎస్సై శ్రీనివాస్ రాజు, పోలీసు సిబ్బందిని జిల్లా అదనపు ఎస్పీ కె.నర్సింహారెడ్డి అభినందించారు.