నిజామాబాద్ లీగల్, ఫిబ్రవరి 6: అవసరమైన వారికి, అర్హులైన వారందరికీ ఉచిత న్యాయసేవలు అందించడమే న్యాయసేవా అధికార సంస్థ లక్ష్యమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సంస్థ పాట్రాన్ ఇన్చీఫ్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ను సహచర హైకోర్టు న్యాయమూర్తి, సంస్థ కార్యనిర్వాహక చైర్మన్ నవీన్రావు, మరో సహచర కోర్టు న్యాయమూర్తి శ్రీసుధతో కలిసి హైకోర్టు ప్రాంగణం నుంచి పర్చువల్ విధానం ద్వారా సోమవారం ప్రారంభించి మాట్లాడారు. అండర్ ట్రయల్ ఖైదీల క్రిమినల్ కేసుల విచారణ వీటితో వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పదహారు జిల్లాలకే పరిమితమైన ఈ కార్యాలయాలు భవిష్యత్ కాలంలో మిగతా అన్ని జిల్లాలకు విస్తరింపజేస్తామన్నారు.
న్యాయసేవల చట్టం బడుగు, బలహీన వర్గాలు, మహిళల న్యాయసాధికారతకు రూపొందించిన చట్టమని, దీని పరిపూర్ణత కోసం పాటుపడదామన్నారు. న్యాయమూర్తి నవీన్రావు మాట్లాడుతూ.. క్రిమినల్ కేసుల్లోనే కాకుండా సామాజిక పథకాల అమలులో న్యాయసేవా అధికార సంస్థ అగ్రభాగాన ఉందని తెలిపారు. నిజామాబాద్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కార్యాలయాన్ని జిల్లా కోర్టులో ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యాలయం అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు. లీగల్ ఎయిడ్ ఉద్దేశాలు, ఆశయాలను న్యాయసేవా సంస్థ జిల్లా కార్యదర్శి , సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి వివరించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జీలు శ్రీనివాస్ రావు, పంచాక్షరి,అసిస్టెంట్ సెషన్స్ జడ్జి శ్రీకాంత్బాబు, జూనియర్ సివిల్ జడ్జీలు సౌందర్య, గిరిజ, భవ్య, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు మంథని రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రం గణపతి, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్కుమార్ సుబేదార్, ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.