ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధ పడకూడదనే ఉద్దేశంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కనీసం దవాఖానలకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న ఎంతో మంది పేదలు, అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపిన కార్యక్రమాన్ని మళ్లీ ప్రజల ముంగిట్లోకి తెచ్చేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. మొదటి విడుతలో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కండ్ల జోళ్లను పంపిణీ చేశారు. మరికొంత మందికి ఉచితంగానే శస్త్ర చికిత్సలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో 12లక్షల మంది, కామారెడ్డి జిల్లాలో 8లక్షల మందికి కంటి పరీక్షలు చేయాలనే లక్ష్యంతో గతంలో నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైంది. ఇదే స్ఫూర్తితో మరోసారి రాష్ట్రవ్యాప్తంగా రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి సన్నద్ధం అవుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
-నిజామాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, నవంబర్ 28, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మానవ శరీర భాగాల్లో కీలకమైన అవయవాల్లో అతి ముఖ్యమైనది, సున్నితమైన భాగం కన్ను మాత్రమే. మనకు ఈ ప్రపంచాన్ని చూసే భాగ్యం కలిగిస్తున్న నేత్రాలు అత్యంత కీలకం. జీవులతో పాటుగా మనిషికి పుట్టుకతో ప్రాప్తించే కన్నులతోనే మనిషి మనుగడను సాధిస్తూ ఉంటాడు. అయితే, మారుతున్న కాలంలో ఆహార అలవాట్లలో భాగంగా కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ రుగ్మతను పారద్రోలేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు పథకానికి శ్రీకారం చుట్టి విజయవంతంగా నిర్వహించింది.
మూడేం డ్ల క్రితం ఉద్యమంలా నిర్వహించిన కంటి వెలుగు విజయవంతం కావడంతో పాటు పేద ప్రజలకు ఎంతో ఉపయుక్తమైంది. పైసా ఖర్చు లేకుండానే పరీక్షలు పూర్తి చేసుకోవడంతో పాటు అవసరమైన వారికి కంటి అద్దాలను ప్రభుత్వమే అందించింది. మరోవైపు వృద్ధులు, పిల్లలు, యువకులకు శస్త్ర చికిత్సలు చేయాల్సి వస్తే వారికి ఉచితంగానే ఆపరేషన్లు సైతం నిర్వహించింది. ఈ మహత్తర కార్యక్రమం ఇప్పుడు మరోమారు అమలుకు నోచుకోబోతున్నది. ఈ మేరకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆరోగ్య తెలంగాణ దిశగా…
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమానికి మరోమారు శ్రీకారం చుట్టారు. తన స్వీయ అనుభవంలో ఎదురైన ఘటనను ఆధారంగా చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రజల జీవితాల్లో కొంగొత్త వెలుగులు నింపాలనే లక్ష్యంలో భాగంగానే కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయడం, డాక్టర్లు సూచనల మేరకు కళ్లద్దాలు, మందులు, శస్త్ర చికిత్సలు పూర్తిగా ఉచితంగా చేయించడం ఈ కార్యక్రమం ముఖ్యోద్ధేశం. ప్రజల యోగక్షేమాల పరిరక్షణ కోసం సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతున్నది.
నిజామాబాద్ జిల్లాలో 12లక్షల మంది, కామారెడ్డి జిల్లాలో 8లక్షల మందికి కంటి పరీక్షలు చేయాలనే లక్ష్యంతో గతంలో నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైంది. ఇదే స్ఫూర్తితో మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు ఆరంభానికి ముహూర్తం ఖరారు కావడంతో పేద ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతున్నది. కంటి చూపు మందగించిన వారు, కంటి సమస్యలతో సతమతం అవుతున్న వారికి సీఎం నిర్ణయం భారీ ఊరట కల్గిస్తోంది.
మొబైల్, ఆటో రిఫ్రాక్టర్తో పరీక్షలు…
కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఊరూరా శిబిరాలను నిర్వహిస్తారు. ఇందులో అధునాతన పరికరాలతో నేత్రాలను పరీక్షిస్తారు. రూ.లక్షలు విలువ చేసే పరికరాలను కొనుగోలు చేసి గ్రామాలకు కంటి వైద్య నిపుణులతో కూడిన బృందాలను ప్రభుత్వం పంపిస్తుంది. గత కార్యక్రమాల్లో రూ.7లక్షలు విలువ చేసే మొబైల్ రిఫ్రాక్టర్ పరికరం వినియోగించారు. ఈ పరికరాన్ని కేవలం ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాలలోనే వాడుతుండగా కంటి వెలుగు శిబిరాల్లోనూ మొబైల్ రిఫ్రాక్టర్ను వాడారు.
మండలానికో బృందాన్ని ఏర్పాటు చేసి మొబైల్ రిఫ్రాక్టర్లు, ఆటో రిఫ్రాక్టర్లు ద్వారా కంటి పరీక్షలు నిర్వహించగా అద్భుతమైన స్పందన ప్రజల నుంచి వచ్చింది. కంటి పరీక్షల్లో భాగంగా ప్రజలకు ఉచితంగానే కళ్లద్దాలు సైతం ప్రభుత్వం పంపిణీ చేసింది. అంతర్జాతీయ టెండర్ ద్వారా కళ్లద్దాలను రాష్ట్ర ప్రభుత్వం వీటిని కొనుగోలు చేసింది. బహిరంగ మార్కెట్లో చాలా ఖరీదైన ఎస్.ఎల్. బ్రాండ్ అద్దాలను ప్రస్తుతం సామాన్య జనానికి సర్కారు ద్వారా పంపిణీ కాగా వాటిని విరివిగా ప్రజలు నేటికీ వినియోగిస్తూనే ఉన్నారు. రూ.600లకు ఒక్కో కళ్లజోడును ప్రభుత్వం కొనుగోలు చేసి ఉచితంగానే ప్రజలకు అందించగా జనవరిలో చేపట్టబోయే కార్యక్రమంలోనూ అమలు కానున్నది.
మానవీయతకు నిదర్శనం…
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) వెలువరించిన గణాంకాల ప్రకారం ఆధునిక సమాజంలో ఆరోగ్య అలవాట్లు, కాలుష్య కారకాలతో కంటికి సంబంధించిన వ్యాధులు పెరుగుతున్నట్లుగా పేర్కొంది. దీంతో కంటి చికిత్స చేయించుకునే స్తోమత లేని నిరుపేదలంతా వేలకు వేలు డబ్బులు ప్రైవేటు దవాఖానల్లో వెచ్చించలేక మిన్నకుండి పోతున్నారు. ఇలాంటి దుస్థితిని రూపు మాపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలా కంటి వెలుగు పేరిట చికిత్సలు నిర్వహించారు. రాష్ట్ర జనాభా అంతటికి ఉచితంగా చికిత్సలు, ఆపరేషన్లు చేయించారు.
ప్రజల్లో కంటి సమస్యలు లేకుండా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కంటి వెలుగును చేపట్టింది. అదే స్ఫూర్తిని మరోసారి చాటబోతున్నది. కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన రాగా ఇప్పుడు అదే రీతిలో హర్షం వ్యక్తం అవుతోంది. చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో కంటి ఇబ్బందులున్నప్పటికీ చికిత్సలు చేయించుకోలేక పోతున్నారు. రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే కంటి వెలుగు ద్వారా అండగా నిలుస్తుండడం కేసీఆర్ సర్కారు మానవీయతకు దర్పణంలా నిలుస్తోందని ప్రజలు అంటున్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకున్నది.