భారత జాగృతి ఆధ్వర్యంలో బుధవారం బోధన్ పట్టణంలో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నారు. ఉదయమే పట్టణానికి చేరుకోనున్న జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సాయంత్రం వరకు వేడుకల్లో పాల్గొంటారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బతుకమ్మ వేడుకల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, జాగృతి నాయకులు ఏర్పాట్లను పరిశీలించారు.
-బోధన్, అక్టోబర్ 17
బోధన్, అక్టోబర్ 17: బోధన్ పట్టణంలో ఈ నెల 18న బుధవారం భారత జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ‘బతుకమ్మ సంబురాలు’ జరుగనున్నాయి. ఈ బతుకమ్మ సంబురాల్లో పాల్గొనేందుకు భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత బోధన్కు వస్తున్నారు. బతుకమ్మ సంబురాలతో బోధన్ పట్టణం ఉదయం నుంచి సాయంత్రం రాత్రి వరకు సందడిగా మారనున్నది. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు కల్వకుంట్ల కవిత ఉదయం 9.30 గంటలకు బోధన్కు వస్తున్నారు. సాయంత్రం వరకు పలువురి ఇండ్లలో బతుకమ్మలను పేర్చే కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు పట్టణంలో బతుకమ్మలతో కవిత ఆధ్వర్యంలో ఊరేగింపు జరుగుతుంది. ఊరేగింపు అనంతరం సా యం త్రం 6 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వేలాదిమంది మహిళలతో బతుకమ్మ వేడుకలు జరుగుతాయి.
ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్లో పెద్ద ఎత్తు న ఏర్పాట్లు జరుగుతున్నాయి. మైదానం మొత్తం శుభ్రపర్చి, లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. అదే కళాశాల గ్రౌండ్స్లో ఉన్న పెద్ద బావిని శుభ్రపర్చి నీటితో నింపారు. వేడుకల్లో బోధన్ శాసనసభ్యుడు మహ్మద్ షకీల్ కూడా పాల్గొంటారు. మైదానంలో ఏర్పాట్లను రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతిరావుతో కలిసి మంగళవారం పరిశీలించారు. అనంతరం రాజీవ్సాగర్, అవంతిరావు, బీఆర్ఎస్ బోధన్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ బతుకమ్మ సంబురాలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు జరిగాయన్నారు. జాగృతి బోధన్ నియోజకవర్గం కన్వీనర్ గట్టు హరికృష్ణ, బోధన్ శివాలయం చైర్మన్ బీర్కూర్ బుజ్జి తదితరులు పాల్గొన్నారు.