కామారెడ్డి/రామారెడ్డి, మే 23 : రామారెడ్డి మండలం సింగరాయిపల్లి చెందిన మాజీ ఎంపీటీసీ, సర్పంచ్ మహేశ్వరి భర్త అధికం నర్సాగౌడ్ (48) జిల్లా కేంద్రం లో ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కాగా గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు చెన్నం నర్సింహారెడ్డి హత్య చేయించాడని కుటుంబ సభ్యులు గ్రామంలో మంగళ వారం ఆందోళనకు దిగారు. ఈ సంఘటనకు సంబం ధించి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సింగరాయిపల్లి సర్పంచ్ మహేశ్వరి భర్త అధికం నర్సాగౌడ్(48) రెండు సార్లు ఎంపీటీసీగా, ఒక సారి వైస్ ఎంపీపీగా, సర్పంచ్గా, ఒక నెల మాచారెడ్డి ఎంపీపీగా పని చేశారు. ప్రస్తుతం ఆయన భార్య మహేశ్వరి సింగరాయిపల్లి సర్పంచ్గా కొనసాగుతున్నారు. నర్సాగౌడ్ సోమవారం పాల్వంచ మండలంలో తహసీల్ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
రాత్రి 7.30 గంటల ప్రాంతంలో పని ఉందని ఇంటి నుంచి బయల్దేరాడు. రాత్రి 11 గంటల ప్రాంతంలో కామారెడ్డిలో ఓ ఫంక్షన్లో ఉన్నానని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా నర్సాగౌడ్ ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. మంగళవారం ఉదయం ఎస్పీ కార్యాలయం వద్ద నర్సాగౌడ్ మృతదేహాన్ని గు ర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి కామారెడ్డి డీఎస్పీ సురేశ్, రూరల్ సీఐ శ్రీనివాస్గౌడ్, ఎస్సై ప్రసాద్ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా దవాఖానకు తరలించారు. దవాఖాన వద్ద కుటుంబ సభ్యులు, గ్రామస్తుల రోదన లు మిన్నంటాయి. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే పూర్తి వివరాలను వెల్లడిస్తామని, భార్య మహేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా పది రోజులుగా గ్రామంలో అభివృద్ధి పనుల విషయమై గొడవలు జరుగుతున్నాయి. వాట్సాప్లో వారంరోజులుగా అసభ్యంగా,అవమానకర మెస్సేజ్లు రావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
కక్షతోనే హత్య చేశారు….
నర్సాగౌడ్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, పది రోజులుగా గ్రామంలో గొడవలు జరుగుతున్నాయని వాటిని దృష్టిలో పెట్టుకొని హత్య చేశారని కుటుంబ స భ్యులు ఆరోపించారు. ఆత్మహత్య చేసుకుంటే ముఖం పై గాయాలు ఎలా ఉంటాయన్నారు.
మృతదేహంతో గ్రామస్తుల ఆందోళన
నర్సాగౌడ్ మృతికి గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు చెన్నం నర్సింహారెడ్డి కారణమంటూ ఆయన ఇంటి ఎదుట మృతదేహాన్ని ఉంచి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. సోమవారం సైతం నర్సింహారెడ్డి.. నర్సాగౌడ్తో గొడవ పడ్డాడని గ్రామస్తులు తెలిపారు. కామారెడ్డి డీఎస్పీ సురేశ్కుమార్ విచారణ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని సముదాయించడంతో వారు అంత్యక్రియ లు నిర్వహించారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్రావు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంత్యక్రియల్లో ఎంపీపీ నారెడ్డి దశరథ్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.