ఆర్మూర్టౌన్, ఏప్రిల్ 24: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆర్మూర్ పట్టణంలోని డిపో ఆవరణలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు శుక్రవారం సంఘీభావం తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ బస్టాండ్లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పటించుకొని, చికిత్స పొందుతూ మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
శంకర్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడడంపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు మూడు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారని తెలిపారు. రెండున్నరేండ్లయినా ఇప్పటివరకు పరిష్కరించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆర్టీసీ కార్మికులకు పూర్తిగా మద్దతు ప్రకటించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.