బిచ్కుంద, ఏప్రిల్ 4 : బీఆర్ఎస్ హయాంలోనే మైనార్టీల అభివృద్ధి జరిగిందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి గాలి అనిల్కుమార్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హన్మంత్షిండే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ సారథ్యంలో మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. విద్యార్థుల కోసం మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ర్టాన్ని ఏండ్లపాటు పాలించిన కాంగ్రెస్ మైనార్టీల కోసం చేసింది శూన్యమేనన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షట్కార్, బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఎంపీలుగా నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. ఒక్కసారి అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, బీఆర్ఎస్ నేతలు అశోక్ పటేల్, నాల్చర్ రాజు, వెంకట్రాంరెడ్డి, నాల్చర్ బాలు, నాల్చర్ శ్రీనివాస్, నీలు పటేల్, దుర్గారెడ్డి పాల్గొన్నారు.