పరిపాలన చేరువైంది. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుతో పారదర్శకంగా సేవలు అందుతున్నాయి. క్షేత్ర స్థాయిలో వేగంగా పనులు జరుగుతున్నాయి. ప్రజలందరికీ పారదర్శకమైన సేవలు అందుతున్నాయి. అధికారులకు సైతం పనిభారం తగ్గడంతో పనులన్నీ వేగంగా సాగుతున్నాయి.
నందిపేట్, సెప్టెంబర్ 21 : ప్రత్యేక తెలంగాణ వచ్చాక పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్త జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేసింది. దీంతో ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువయ్యాయి. సమస్యలు సత్వరమే పరిష్కారం కావాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొత్త మండలాల్లో పనులన్నీ వేగంగా జరిగిపోతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల ద్వారా ఏ అవసరం వచ్చినా ఎక్కడో దూరంలో ఉన్న మండల కార్యాలయం చుట్టూ నాలుగుసార్లు తిరిగితేకానీ పనులు జరిగేవి కాదు. గ్రామాలు ఎక్కువగా ఉండడంతో పనిభా రం ఎక్కువగా ఉండేది. దీంతో ఫైళ్లు నెమ్మదిగా ముం దుకు కదిలేవి. ఇప్పుడు కొత్త మండలాల ఏర్పాటుతో పనిభారం తగ్గిపోవడంతో ఫైళ్లు చకచకా ముందుకు కదులుతున్నాయి. దీంతో ప్రజలకు పనులు వెంటనే పూర్తవుతున్నాయి. గతంలో పనులకోసం పైరవీకారుల ద్వారా కార్యాలయాలకు వెళ్లి పనులు చేయించుకునే పరిస్థితి ఉండగా, నేడు సమీపంలోనే కార్యాలయం ఉండడంతో నేరుగా వెళ్లి అధికారులతో పనులు చేయించుకుంటున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఆర్మూర్, నందిపేట్, ఆర్మూర్ పాత మండలాల నుంచి కొన్ని గ్రామాలను తీసుకొని కొత్తగా రెండు మండలాలు ఏర్పాటుచేశారు. దీంతో పాత మండలాలకు గ్రామాలు తగ్గిపోవడం, తక్కువ గ్రామాలతో రెండు కొత్త మండలాలు ఏర్పడడంతో పనులు సునాయసంగా జరుగుతున్నా యి. ఇప్పటివరకు డొంకేశ్వర్, ఆలూర్ తహసీల్ కార్యాలయాల్లో వేలాది సంఖ్యల్లో వివిధ ధ్రువీకరణ పత్రాలను జారీ చేశారు. వందల సంఖ్యల్లో భూముల రిజిస్ట్రేషన్లు చేశారు. పాత మండలాలు ఉన్నప్పుడు గ్రామాలు ఎక్కువగా ఉండడంతో రిజిస్ట్రేషన్లు త్వరగా పూర్తయ్యేవికాదు. రిజిస్ట్రేషన్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో పనిపూర్తికావడానికి రెండు మూడు రోజులు పట్టేవి. ఇప్పు డు ఒక్క రోజు లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతోంది.
తగ్గిన పనిభారం
గ్రామాల సంఖ్య తగ్గిపోవడంతో కార్యాలయాలకు పని భారం తగ్గిపోయింది. సమస్యల పరిష్కారానికి గతంలో సమయం సరిపోయేది కాదు. దీంతో ఎన్నో ఫైళ్లు పెండింగ్లో ఉండేవి. గతంలో ఇద్దరు చేసే పనిని ఇప్పుడు నలుగురు చేస్తున్నారు. దీంతో పనులు చకచకా ముందుకు వెళ్లడంతో ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగడం తగ్గిపోయింది. ఉమ్మడి నందిపేట్ మండలం నుంచి తొండాకూర్, దత్తాపూర్, మారంపల్లి, గంగాసముందర్, నూత్పల్లి, డొంకేశ్వర్, అన్నా రం, సిర్పూర్, జీజీ నడ్కుడ, గాదేపల్లి, చిన్నయానం, నికాల్పూర్, కోమట్పల్లి మొత్తం 13 గ్రామాలు విడిపోయి డొంకేశ్వర్ మండలంగా ఏర్పడింది. అలాగే మాక్లూర్ నుంచి కల్లెడి, డీకంపల్లి, గుత్ప, రాంచంద్రపల్లి, గుత్ప తండా, రామస్వామి క్యాంపు, ఆర్మూర్ మండలం నుంచి ఆలూర్, దేగాం, మచ్చర్ల, మిర్దాపల్లి, గగ్గుపల్లి గ్రామాలతో ఆలూర్ మండలం ఏర్పాటైంది.
వేలల్లో ధ్రువీకరణ పత్రాలు జారీ
ఉమ్మడి మండలాల్లో ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చేవారితో తహసీల్ కార్యాలయాలు కిక్కిరిసిపోయి కనిపించేవి.. ఇప్పుడు ఎక్కడికక్కడే జారీ కావడంతో కార్యాలయాల్లో జనం రద్దీ తగ్గిపోయి సిబ్బంది ప్రశాంతంగా తమ పని తాము చేసుకుంటున్నారు. ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవడమే ఆలస్యం కార్యాలయ సిబ్బంది ప్రక్రియను వెనువెంటనే పూర్తి చేసి పత్రాలను జారీ చేస్తున్నారు. 2022 అక్టోబర్లో కొత్త మండలాల నుంచి పాలన ప్రారంభమైంది. ఇప్పటి వరకు తహసీల్ కార్యాలయాల్లో కుల, ఆదాయ, జనన, మరణ ధ్రువీకరణ, స్థానికత తదితర ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. ఇందులో ఆలూర్ తహసీల్లో 9120, డొంకేశ్వర్ లో 5600 ధ్రువీకరణ పత్రాలను జారీ చేశారు.భూముల క్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్టేషన్లు ఆలూర్ లో 705, డొంకేశ్వర్ లో 250 పూర్తిచేశారు. పౌతీ, నాలా మార్పిడి, మార్డ్గేజ్ తదితర పనులన్నీ వెంటనే పూర్తవుతున్నాయి.
పెరిగిన భూముల డిమాండ్
మండలాల ఏర్పాటుతో డొంకేశ్వర్, ఆలూర్ మండల కేంద్రాల్లో భూములకు డిమాండ్ పెరిగింది. మండలాల ఏర్పాటు తరువాత రోడ్డును ఆనుకొని, గ్రామాన్ని ఆనుకొని ఉన్న భూముల రేట్లు దాదాపు రెట్టింపు అయ్యా యి. అలాగే ప్లాట్ల రేట్లు సైతం పెరిగిపోయాయి. డొంకేశ్వర్, ఆలూర్ మండల కేంద్రాల చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రా వడంతో ప్లాట్ల రేట్లు పెరిగిపోతున్నాయి. నివాస ఇండ్లు, షట్టర్ల కిరాయిలకు డిమాండ్ పెరిగింది. కొత్త కొత్తగా ఆయా దుకాణాలు ఏర్పాటై వ్యాపారాలు పుంజుకుంటున్నాయి.