ఇన్నేండ్లూ స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉండి.. అరవై ఏండ్ల వయస్సులో తొలగింపునకు గురైన మహిళలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వృద్ధ మహిళలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు సర్కారు విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నది. అరవై ఏండ్లు దాటిన వృద్ధ మహిళలనూ బృందాలుగా చేసి స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం సెర్ప్ అధికారులు సర్వే చేపడుతున్నారు. ఇతర సంఘాల మాదిరిగానే వీరికీ అన్ని రకాల రుణ సౌకర్యాలు కల్పించనున్నారు.
– బీర్కూర్, ఏప్రిల్ 10
బీర్కూర్, ఏప్రిల్ 10: వృద్ధ మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. స్వయం సహాయక సంఘాల్లో 18 నుంచి 60 ఏండ్లలోపు మహిళలకు మాత్రమే అవకాశం ఉండేది. 60ఏండ్లు నిండిన వారిని గ్రూపుల నుంచి తొలగించేవారు. కాగా, వారిని కూడా ఇకపై కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నది. 60 ఏండ్లు నిండిన మహిళల వివరాలను సేకరించాలని జిల్లా సెర్ప్ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో సెర్ప్ అధికారులు గ్రామాల్లో తిరుగుతూ సర్వే చేస్తున్నారు.
సంఘాల ఏర్పాటు ఇలా..
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలో 60 ఏండ్లు నిండిన మహిళలను గుర్తించి స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేర్పించి వారు పొదుపు చేసేలా అవగాహన కల్పిస్తున్నారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన ప్రత్యేక యాప్లో వారి పేర్లను నమోదు చేసి బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారు. ఇతర సంఘాల మాదిరిగానే ప్రతి నెలా గ్రూప్ సమావేశాలు నిర్వహించి సభ్యుల కోరిక మేరకు పొదుపు చేసిన వాటి నుంచి రుణాలు అందించే సౌకర్యం కల్పిస్తున్నారు. ఇప్పటికే సంఘాల నుంచి 60 ఏండ్లు దాటిన వారు ఉంటే వారిని ఆ గ్రూపులో నుంచి తొలగించకుండా వృద్ధ సంఘాల్లోకి మారుస్తున్నారు. ఒక్కో సంఘంలో 10 మంది సభ్యులు ఉండేలా గ్రూపులు ఏర్పాటు చేస్తారు. ఎవరైనా సభ్యులు మరణించినా, ఇతర ప్రాంతాలకు వెళ్లినా ఆ గ్రూపులో మరొక సభ్యురాలిని చేరుస్తారు. మహిళల పొదుపులు, రుణాల కోసం నెలనెలా సమావేశాలు నిర్వహిస్తారు. రుణాల చెల్లింపుల విషయంలో నియంత్రణ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయా సంఘాలు 60 ఏండ్లు నిండిన వారిని గుర్తించి వృద్ధ మహిళా సంఘాల్లో చేరుస్తున్నారు.
సంఘాలను ఏర్పాటు చేస్తాం
ఇటీవల బీర్కూర్ మండలంలోని అన్నారం, బీర్కూర్లో రెండు వృద్ధ మహిళా సంఘాలను ఏర్పా టు చేశాం. మండలంలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు సమావేశాలు నిర్వహించాం. 60 ఏండ్లు ఉన్న వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో వృద్ధ మహిళలకు ఎంతో మేలు చేకూరుతుంది.
– గంగాధర్, ఏపీఎం, బీర్కూర్
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
నా వయసు 65 సంవత్సరాలు. 25 సంవత్సరాలుగా స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉన్నాను. ఇటీవల సీఎం సారూ మాలాంటి వృద్ధుల కోసం వృద్ధ మహిళా సంఘాలను ఏర్పాటు చేయడంతో ఈ వయసులో ఎంతో ఆసరా లభిస్తున్నది. పింఛన్ ద్వారా వచ్చే డబ్బులను సంఘంలో పొదుపు చేసుకోవడంతో తమకు చేతగాని రోజులు వచ్చినప్పుడు చేదోడువాదోడుగా ఉంటాయి. తమలాంటి వారి కోసం ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ సారూ చల్లంగ ఉండాలి.
– అనసూయ, బీర్కూర్