సెప్టెంబర్ సెంటిమెంట్కు ముందే నిండుకుండలా ఎస్సారెస్పీ
రెండేండ్లుగా జూలైలోనే నిండుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
కమ్మర్పల్లి, జూలై 11: ఎస్సారెస్పీ రెండేండ్లుగా జూలైలోనే నిండుకుండలా మారుతున్నది. ప్రాజెక్టు నిర్మాణమైన తొలినాళ్లల్లో 1983లో మినహా ఎప్పుడైనా ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లోనే ఎస్సారెస్పీకి భారీ వరదలు వచ్చి నిండిన చరిత్ర ఉంది. కానీ గత సీజన్ నుంచి జూలైలోనే ఎస్సారెస్పీకి వరద పోటెత్తుతున్నది. గత సీజన్ జూలై, ప్రస్తుత సీజన్ జూలైలో ప్రాజెక్టుకు వచ్చిన ఇన్ఫ్లోల సరళిని పరిశీలిస్తే జూలై మాసం ఎస్సారెస్పీకి రెండేండ్లుగా వరదల మాసంగా నిలుస్తున్నదని అర్థమవుతుంది. గత సీజన్ (2021)లో జూన్ 3 నుంచే ప్రాజెక్టుకు ఇన్ఫ్లో ప్రారంభమైంది. గత సీజన్లో జూన్ 1న 18.437టీఎంసీల నీరు ఉంటే జూన్ 30లోగా 26.984 టీఎంసీలకు చేరింది. 8.547 టీఎంసీల నీరు జూన్ మాసంలోనే వచ్చింది. జూలైలో మొత్తం 31 రోజుల్లో 30 రోజులు ఇన్ఫ్లో కొనసాగింది. జూలై 13 నుంచి అప్పట్లో ఆశాజనకంగా వరదలు ప్రారంభమయ్యాయి. జూలై 22న 4 లక్షల 32 వేల క్యూసెక్కుల భారీ ఇన్ఫ్లో రాకతో 32 గేట్లు ఎత్తి లక్షన్నర క్యూసెక్కుల నుంచి 6లక్షల క్యూసెక్కుల జలాలను మూడు రోజుల పాటు దిగువకు వదిలారు. దీంతో ఆ సీజన్లో జూన్ 1న 27.360 టీఎంసీలుగా ఉన్న నీటిమట్టం 18వ తేదీలోగా 70 టీఎంసీలకు, 24న 102 టీఎంసీలకు, 30న మొత్తం 119 టీఎంసీల ఇన్ఫ్లోతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది.
ఈ వానకాలంలో గత జూన్తో పోలిస్తే తక్కువ ఇన్ఫ్లోతోనే కొనసాగింది. జూన్ మాసంలో కేవలం 6.98 టీఎంసీల ఇన్ఫ్లో మాత్రమే వచ్చింది. కానీ జూలై రెండోవారం ప్రారంభం కాగానే ఆశాజనక వరదలు ప్రారంభమయ్యాయి. గత సీజన్ జూలైలో 22వ తేదీ నుంచి భారీ వరదలు రాగా ఈ సీజన్ జూలైలో 9 నుంచే మొదలయ్యాయి. జూలైలో 2న బాబ్లీ గేట్ల ఎత్తివేతతో 15 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ప్రారంభమైంది. తర్వాత 6న 16,146 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. 7న 22 వేల క్యూసెక్కులు, 8న 27వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. 8వ తేదీలోగా ఈ సీజన్ మొత్తంలో 14.735 టీఎంసీల ఇన్ఫ్లో వచ్చింది. 9న ప్రాజెక్టును నింపే అసలైన భారీ వరదల రాక ప్రారంభమైంది. 9న లక్షా 71 వేలు, 10న 4లక్షల92 వేల క్యూసెక్కుల భారీ వరదలు క్రమంగా వచ్చాయి. దీంతో 10న ఉదయం వరద కాలువ ద్వారా నీటి విడుదలను ప్రారంభించారు. అదేరోజు రాత్రి ఎస్సారెస్పీ 9 గేట్లు ఎత్తి దిగువకు మిగులు జలాలను వదిలారు. ఈ భారీ ఇన్ఫ్లోలతో ఈ సీజన్లో 10న ఉదయం 31.128 టీఎంసీలుగా ఉన్న మొత్తం ఇన్ఫ్లో.. 11వ తేదీ ఉదయంలోగా 59.230 టీఎంసీలకు పెరిగింది.
90వేల క్యూసెక్కుల నీటి విడుదల
మెండోరా, జూలై 11: ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో ఎస్సారెస్పీ వరదగేట్ల నుంచి 90,000 క్యూసెక్కుల నీటి విడుదల చేపట్టినట్లు ప్రాజెక్టు ఏఈ వంశీ సోమవారం తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 50,100 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరుగుతూ 1088 అడుగులకు చేరిందన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 76.743 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. కాకతీయ కాలువకు అనుసంధానంగా ఉన్న ఎస్కేప్ గేట్లతో గోదావరిలోకి 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు జెన్కో ఈఈ శ్రీనివాస్ తెలిపారు. వరదకాలువకు 14,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ చెప్పారు.