నిజామాబాద్ : రైతులందరికీ రుణమాఫీ చేయాలని ( Loan Waivers) ప్రభుత్వాన్ని
నిలదీసినందుకు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి బీఆర్ఎస్ నాయకులను, రైతులపై అక్రమ కేసులు పెట్టి రెండేండ్లుగా కోర్టుల చుట్టూ తిప్పుతుండడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకు శత్వానికి నిదర్శనమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ( Vemula Prashanth Reddy ) అన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని తీవ్రంగా ఖండించారు. బాల్కొండ నియోజకవర్గంలో 52,000 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా కేవలం 22,000 మంది రైతులకు రుణమాఫీ చేసి ఇంకా 30,000 మంది రైతులకు రుణమాఫీ కాలేదని అన్నారు.
వీటిపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకు కేసులు పెట్టి శుక్రవారం ఆర్మూర్ కోర్టులో కేసు హియరింగ్కు హాజరైన బీఆర్ఎస్ నాయకులు,రైతులు తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వం వెంటనే పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేయడం సమంజసమని ఆయన పేర్కొన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని , పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయాలని ,రైతులను ఇబ్బందులకు గురిచేసే విధానాలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని వేముల డిమాండ్ చేశారు.