భిక్కనూరు, మే 6: లారీ కొరత తీర్చాలని కోరుతూ మండలంలోని కాచాపూర్ గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. కాచాపూర్ నుంచి పెద్దమల్లారెడ్డి వెళ్లే రోడ్డుపై బుధవారం ధర్నా నిర్వహించారు. కాచాపూర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో సుమారు 6 వేల బస్తాల ధాన్యం తూకం పూర్తయినా, లారీలు రాకపోవడంతో పది రోజులుగా అక్కడే ఉండిపోయాయి.
దీంతో ధాన్యం తరలింపులో నెలకొన్న జాప్యాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. వర్షాలు కురిస్తే పంటను నష్టపోయే ప్రమాదం ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు వెంటనే స్పందించి లారీలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని వారు హెచ్చరించారు.