వేల్పూర్/నస్రుల్లాబాద్/డిచ్పల్లి, జూన్ 12: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని, పాత పద్ధతిలో యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు శుక్రవారం పలు మండలాల్లో రోడ్డెక్కారు. వేల్పూర్ మండలం అంక్సాపూర్లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. యూరియా యాప్తో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చూస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా, అవి ఆచరణకు నోచుకోవడంలేదని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి రాగా, కలెక్టర్ వచ్చి హామీ ఇస్తేనే తాము ధర్నా విరమిస్తామని రైతులు స్పష్టం చేశారు. సమాచారం అందుకున్న బాల్కొండ సీఐ జాన్రెడ్డి, వ్యవసాయాధికారులు అంకాపూర్కు చేరుకొని రైతులతో మాట్లాడారు. శనివారం ఆరు లారీల యూరియా గ్రామానికి పంపిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.

యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీర్కూర్ మండల కేంద్రంలోని బాన్సువాడ-పొతంగల్ ప్రధాన రహదారి పై ఆయా గ్రామాల రైతులు రాస్తారోకో చేశారు.గురువారం యూరియా బుక్ చేసుకున్న రైతులు శక్రవారం గ్రోమోర్ ఎరువుల దుకాణం వద్దకు ఉదయం 7గంటలకు చేరుకున్నారు. 11 గంటలైనా షాపు తెరవకపోవడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డు పై బైఠాయించి రాస్తారోకో చేశారు. పోలీసులు రైతులను సముదాయించి రాస్తారోకోను విరమింపజేశారు. దుకాణం తెరిచాక ఈ పాస్ మిషన్ పనిచేయకపోవడంతో రైతులు యజమానులతో వాగ్వాదానికి దిగారు. మళ్లీ పోలీసులు జోక్యం చేసుకుని యూరియా పంపిణీ చేయించారు. రైతులకు గ్రామ సర్పంచ్ ధర్మతేజ మద్దతు తెలిపారు.

డిచ్పల్లి మండల కేంద్రంలో యూరియా బస్తాల కోసం అన్నదాతలు బారులు తీరారు. యూరి యా దొరక్కపోవడంతో చెప్పులను వరుస క్రమంలో ఉంచి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. యూరి యా యాప్తో రైతులు నానా కష్టాలు పడుతున్నారని, వెంటనే యాప్ను తొలగించాలని డిమాండ్ చేశారు. యాప్ పోవాలే… కేసీఆర్ రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నిరక్షరాస్యులైన రైతులకు యాప్తో యూరియా బుక్ చేయడం రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రేవంత్రెడ్డి పాలన గాలికొదిలేశారని, రైతు సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.