రామారెడ్డి, జూన్ 8: వర్షానికి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ మండలంలోని అన్నారం గ్రామంలో సోమవారం రైతులు ఆందోళన చేపట్టారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కాంటా పూర్తయి వర్షానికి తడిసిపోయిన ధాన్యాన్ని పక్కనబెట్టి, కేవలం తడవని ధాన్యాన్ని మాత్రమే లారీల్లోకి లోడ్ చేశారు. రెండు నెలల క్రితం పంటను కోసి కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ఆరబెట్టగా వర్షాలకు అది తడిసిపోయింది. దీంతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయబోమంటూ కేంద్రం నిర్వాహకులు చెప్పడంతో కోపోద్రిక్తులైన రైతులు ఆందోళన చేపట్టారు.
తడిసిన ధాన్యం బస్తాలను రోడ్డుపై వేసి వాటికి నిప్పుపెట్టి నిరసన వ్యక్తంచేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు. రైతులు ససేమిరా అనడంతో ఎస్సై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, జిల్లా పౌర సరఫరాల అధికారులు రామ్మోహన్, వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ఉమాలతతో కలిసి అక్కడికి చేరుకున్నారు. రైతులతో అదనపు కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. లారీలను పంపించి సమస్యను పరిష్కరించగా, రైతులు ధర్నా విరమించారు.