ఇందూరు జిల్లా చలి కౌగిలిలో చిక్కుకుని వణుకుతున్నది. తెలవారక ముందే మంచు దుప్పటి పరుచుకుంటున్నది. ఉమ్మడి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా వీస్తున్న శీతల గాలులు వణుకు పుట్టిస్తున్నాయి. ఉదయం తొమ్మిది గంటలు దాటినా చలి తగ్గడం లేదు. రాత్రి ఏడు దాటితే జనం బయటికి రావడం లేదు. వాతావరణ మార్పులతో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. శీతల గాలుల నుంచి రక్షించుకునేందుకు స్వెట్టర్లు, మంకీ క్యాప్లు, మప్లర్ల వినియోగం పెరిగింది. డిమాండ్ పెరగడంతో వాటి రేట్లకు రెక్కలొచ్చాయి. మరోవైపు, చలి తీవ్రత పెరుగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఆస్తమా, న్యూమోనియా, హృద్రోగ బాధితులు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యంతో పాటు చర్మ సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు.
– విద్యానగర్/ఖలీల్వాడి, నవంబర్ 5
ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరిగింది. రెండ్రోజుల కిందట రాత్రివేళల్లోనే చలి ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఉదయం కూడా ప్రభావం చూపుతున్నది. రాత్రి 9 నుంచి ఉదయం 8 గంటల వరకు బయటికి రావాలంటే ప్రజలు గజగజ వణికిపోతున్నారు. తెల్లవారుజాము నుంచి రోడ్లను మంచు కప్పివేస్తుంది. చలికాలం ప్రారంభమై 25 రోజులవుతున్నది. వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు రావడంతో ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి తీవ్రతను తట్టుకునేందుకు స్వెటర్లు, మంకీ క్యాప్లను కొనుగోలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనున్నదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు, ముఖ్యంగా శ్వాసకోశ, ఆస్తమా, న్యూమోనియా బాధితులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నవంబర్ ఆరంభంలోనే చలి పంజా విసురుతుండడంతో ఉదయం వేళలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తేలికపాటి ఆహారం బెటర్..
చలికాలంలో రాత్రి పూట తేలికపాటి ఆహారం తీసుకోవాలి. తక్కువగా తింటూ రుచులను ఆస్వాదించాలి. రాత్రి పూట మాంసాహారం తీసుకోవద్దు. ఫ్రూట్స్, సలాడ్లు, కూరగాయలు తీసుకోవాలి. వేపుళ్లకు దూరంగా ఉండాలి. నూనెను తక్కువగా వాడాలి. ఇండ్లలోనే గోధుమ, జొన్న, మక్క రొట్టెను చేసుకొని తినాలి. డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. దాహం వేయకపోయినా ద్రవ పదార్ధాలు తీసుకోవాలి. అల్లం, తులసీ, దాల్చిన చెక్కతో తయారు చేసిన చాయ్ తాగాలి. దగ్గు, జలుబు నివారణకు యాలకులను నీటిలో వేసి మరిగించి చల్లారక తాగాలి. రాత్రి సమయంలో వెచ్చటి ఉన్ని దుస్తులను ధరించాలి. స్వెట్టర్లు, రగ్గులు, మఫ్లర్లు, మంకీ క్యాపులను వేసుకోవాలి.
స్వెట్టర్లకు గిరాకీ..
చలికాలం నేపథ్యంలో మా ర్కెట్లో ఉన్ని దుస్తులకు గిరా కీ పెరుగుతున్నది. నేపాల్ నుంచి దిగుమతి చేసుకునే మఫ్లర్లు, బ్లాంకెట్ల అమ్మకాలు ఎక్కువయ్యాయి.
చర్మం జాగ్రత్త..
చలికాలంలో చర్మం త్వరగా పొడిబారుతుంది. దీంతో మాయిశ్చరైజర్, కోల్డ్ క్రీములను శరీరంపై రాస్తుంటాం. వీటిలో ఉండే రసాయనాల వల్ల చర్మం సమస్యల బారినపడుతుంది. అందుకే ఇంట్లో దొరికే సహజ పదార్థాలను ఎక్కువగా వాడాలి. దీంతో చర్మం తాజాగా ఉంటుంది. కొబ్బరినూనె చర్మానికి కావాల్సిన తేను అందిస్తుంది. కొబ్బరి నూనెను ముఖానికి రాసుకుంటే మృదువుగా తయారవుతుంది. వీలైనంత వరకు చర్మానికి సంబంధించిన కాస్మెటిక్ ట్రీట్మెంట్లకు చలికాలంలో దూరంగా ఉండాలి. కొబ్బరినూనె, ఆలివ్ నూనె, ఆవనూనె, కుసుమ నూనెను చర్మానికి వాడొచ్చు.
పిల్లలు, పెద్దలూ పైలం..
వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నప్పుడు అందరి శరీరాలు అందుకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవాలి. ఈ సమయంలో వ్యాధులు దరిచేరే అవకాశాలున్నాయి. చలి గాలుల ప్రభావంతో ఐదేండ్లలోపు పిల్లలతోపాటు అరవై ఏండ్లు పైబడిన వారిని సమస్యలను వెంటాడే అవకాశమున్నది. ఊపిరితిత్తుల వ్యాధులు, దీర్ఘకాలిక చర్మవ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. చలితో జ్వరం, జలుబు, సైనసైటిస్, ఆస్తమా, సీవోపీడీ, న్యూమోనియా, బ్రాంకైటిస్ లాంటి వ్యాధులతోపాటు చర్మ సంబంధ వ్యాధులు ఎక్కువ వస్తాయని పేర్కొంటున్నారు.
వైరస్, బ్యాక్టీరియా పంజా..
శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలిగాలులు వీస్తాయి. దీంతో వైరస్, బ్యాక్టీరియాలు విజృంభిస్తాయి. ఈ సమయంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారిలోకి వైరస్, బ్యాక్టీరియాలు ప్రవేశించి ప్రాణాంతక వ్యాధులను కలిగిస్తాయి. ముఖ్యంగా చలితీవ్రత పెరిగినప్పుడు శ్వాస నాళాలు కుచించుకుపోయి.. గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. వైరస్ల మూలంగా జలుబు, గొంతునొప్పి, సైనసైటీస్, నిమోనియా, ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ తదితర శ్వాసకోశ వ్యాధులు తీవ్రమవుతాయి. ఫ్లూ జ్వరాలు వ్యాప్తి చెందుతాయి. జనాల రద్దీ ప్రాంతాల్లో వైరస్లు ఒకరి ద్వారా మరొకరికి తేలిగ్గా వ్యాపిస్తాయి. అలాంటి ప్రదేశాలకు వెళ్లొద్దు.
ఎలర్జీలకు చెక్ పెట్టండి..
ఉష్ణోగ్రతలో తేడాతో దగ్గు, జలుబు సమస్యలకు తోడు గొంతు సంబంధిత ఎలర్జీలు వస్తుంటాయి. గొంతులో గరగర, ఎలర్జీలు సమస్యాత్మకంగా మారుతుంటాయి. గొంతునొప్పి, ఎలర్జీతో బాధపడేవారు వంటింట్లో ఉండే అల్లంతో చెక్ పెట్టవచ్చు. దీని కోసం అల్లంను ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు. వంటల్లో వాడడం, అల్లం టీ తాగడం చేయవచ్చు. సాయంత్రం వేళల్లో అల్లం టీ తాగడంతో గొంతునొప్పి నుంచి విముక్తి పొందవచ్చు. కొద్దిగా అల్లాన్ని టీ లేదా తేనెలో కలుపుకొని తీసుకుంటే మెరుగైన ఫలితముంటుంది.
అందుబాటులో మందులు..
చలికాలంలో ముందస్తు జాగ్రత్తలు ప్రజలు తప్పకుండా తీసుకోవాలి. ఉష్ణోగ్రతలు తగ్గుతున్న కొద్దీ వాతావరణంలో మార్పుల కారణంగా వివిధ రోగాలు వచ్చే అవకాశాలున్నాయి. దానికి అనుగుణంగా అన్ని పీహెచ్సీల్లో వైద్యసేవలు, మందులు అందుబాటులో ఉన్నాయి.
– డాక్టర్ సుదర్శనం, డీఎంహెచ్వో, నిజామాబాద్
ఆస్తమా రోగులు జాగ్రత్తగా ఉండాలి..
చలికాలంలో ఎక్కువగా ఆస్తమా ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందస్తుగా వైద్య పరీక్షలు చేయించుకుని మందులను వాడాలి. ఉదయం 9దాటిన తర్వాతే బయటికి వస్తే మంచిది. రాత్రివేళలో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్లాలి.
– డాక్టర్ జలగం తిరుపతిరావు, ఫిజీషియన్ (ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రొఫెసర్) నిజామాబాద్
చల్లని పదార్థాలు తినిపించొద్దు..
చలికాలంలో చిన్న పిల్లలను అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న పిల్లలకు చల్లని నీరు తాగించొద్దు. ఉదయం నుంచి రాత్రి వరకు పిల్లలకు కాచిన వేడి నీటిని మాత్రమే పట్టించాలి. చల్లటి పదార్థాలు, ఐస్క్రీమ్, శీతలపానీయాలు తాగించొద్దు.
– డాక్టర్ హరికృష్ణ, పిల్లల వైద్య నిపుణులు, నిజామాబాద్
శరీరాన్ని వెచ్చగా ఉంచాలి..
చలికాలంలో వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలి. చర్మం దురద రాకుండా ఉండాలంటే స్నానం చేసే 30 నిమిషాల ముందు కొబ్బరి నూనె శరీరానికి రాసుకోవాలి. శరీరాన్ని ఎప్పుడూ వెచ్చగా ఉంచుకోవడానికి స్వెట్టర్లు, మంకీ క్యాప్లను ధరించాలి. నీటిని వేడి చేసి తాగాలి. జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి.
-డా. అఖిల,చర్మవ్యాధి నిపుణురాలు, ప్రభుత్వ దవాఖాన