ఖలీల్వాడి, డిసెంబర్ 1: నిజామాబాద్ జిల్లాలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ప్రశాంత వాతావరణం నడుమ సాఫీగా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కౌంటింగ్ కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూమ్లకు చేర్చారు. ఆయా సెగ్మెంట్ల నుంచి ఈవీఎంలు ఓట్ల లెక్కింపు కేంద్రాలైన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు తరలించారు. వాటిని సరి చూసుకొని స్ట్రాంగ్ రూముల్లో ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా అమర్చారు. పోటీలో ఉన్న అభ్యర్థుల ఏజెంట్లు, ఎన్నికల పరిశీలకుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లకు శుక్రవారం ఉదయం సీల్ వేశారు. జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్గాంధీ హన్మంతు, సీపీ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డి తదితరులు ఈవీఎంల భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద సాయుధ బలగాలతో పహారా ఏర్పాటు చేశారు. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా స్ట్రాంగ్ రూంలతోపాటు వాటి పరిసరాలను పరిశీలించేందుకు వీలుగా సీసీ కెమెరాలను అమర్చి మానిటర్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద శుక్రవారం సా యంత్రం 5 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉటుందని సీపీ తెలిపారు. కలెక్టర్, సీపీలు అక్కడ అన్ని ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్ల రాకపోకల కోసం వేర్వేరు మార్గాల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లను పరిశీలించారు. అదనపు డీసీపీ జయరాం, ఆర్డీవో రాజేంద్రకుమార్, మెప్మా పీడీ రాజేందర్, పలు శాఖల అధికారులు ఉన్నారు.