కామారెడ్డి, జనవరి 19: బడుల్లో ఎన్నికలకు నగారా మోగింది. పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ నేటి(శనివారం) నుంచే ప్రారంభం కానున్నది. ఉదయం 10 గంటలకు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నికల్లో పాల్గొనేలా హెచ్ఎంలు నోటీసు జారీ చేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం విద్యార్థుల తల్లిదండ్రుల పేర్లను నోటీసు బోర్డుపై ప్రదర్శించనున్నారు. ఈ నెల 22, 23వ తేదీల్లో ఎన్నికల్లో పాల్గొనే తల్లిదండ్రుల జాబితాపై అభ్యంతరాలు ఉంటే స్వీకరించి పరిష్కరించనున్నారు. 24న తల్లిదండ్రుల తుది జాబితాను ప్రదర్శిస్తారు. 29న ఉదయం 7గంటల నుంచి మధ్యాహం 1గంట వరకు పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులను ఎన్నుకొని వారిలో నుంచి ఒకరిని అధ్యక్షుడిగా, మరొకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. 29వ తేదీ సాయంత్రం 5గంటల్లోగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి ఎన్నికల నివేదిక పంపిస్తారు.
ప్రతి తరగతికి ముగ్గురు సభ్యులను ఎన్నుకుంటారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉంటారు. వీరితోపాటు అనాథ, ఎస్సీ, ఎస్టీ, వలసల, వీధిబాలల, ప్రత్యేక అవసరాల పిల్లల, హెచ్ఐవీ బారినపడిన పిల్లల తల్లిదండ్రుల్లో ఒకరిని ఎన్నుకోవాలి. మరొకరు బలహీనవర్గాలకు చెందిన తల్లిదండ్రులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. మూడో వ్యక్తిని ఎవరినైనా ఎన్నుకోవచ్చు అనే నిబంధనలు విధించారు. ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులు ఉంటే తరగతికి ముగ్గురు చొప్పున 15మందిని, ప్రాథమికోన్నత పాఠశాలలో 7వ తరగతి వరకు ఉంటే 21మంది, 8వ తరగతి వరకు ఉంటే 24 మంది సభ్యులను, ఉన్నత పాఠశాలల్లో 6,7,8 తరగతుల తల్లిదండ్రులలో 9మంది సభ్యులుగా ఎన్నుకోవాల్సి ఉంటుం ది. ఎన్నికైన వారు రెండేండ్లపాటు పదవిలో కొనసాగుతారు. ఎన్నికలు జరిగే పాఠశాలలో ఓటర్ల జాబితాలోని తల్లిగాని, తండ్రి లేక సంరక్షకులు ఒకరే ఓటు వేయడానికి అర్హులు. 50శాతం హాజరుకాకపోతే ఎన్నిక నిలిపివేసే అధికారం ఉన్నది. చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ నిర్వహించనున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రహస్య బ్యాలెట్ ఓటింగ్ పద్ధతిని నిర్వహించే అవకాశం ఉంటుంది.
పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలకు (ఎస్ఎంసీ) ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులే కన్వీనర్లుగా ఉండనున్నారు. మరో సీనియర్ ఉపాధ్యాయుడు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, ఏఎన్ఎం, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, అంగన్వాడీ కార్యకర్త.. ఎక్స్అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు. ఎన్నికైన సభ్యులతోపాటు ఈ ఆరుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు, ఇద్దరు కోఆప్షన్ సభ్యులు ఉంటారు. ప్రాథమిక పాఠశాలలో ఎన్నికైన 15మందితోపాటు ఆరుగురు ఎక్స్అఫిషియో సభ్యులు, కోఆప్షన్ సభ్యులు మొత్తం 23 మంది ఉంటారు. 7వ తగరతి వరకు 29మంది, 8వ తరగతి ఉంటే 32 మంది, హైస్కూల్లో మొత్తం 17మంది సభ్యులు ఉంటారు. వీరితోపాటు ఆయా పాఠశాలల పరిధిలోని విద్యావేత్తలు, పాఠశాల అభివృద్ధికి సహకరించే దాతలను ఎస్ఎంసీ సభ్యులుగా ఎంపిక చేసుకోవచ్చు. పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ సమావేశాలకు సర్పంచు, పురపాలక చైర్మన్లు హాజరవుతారు.
ఖలీల్వాడి, జనవరి 19 : జిల్లాలో ఈ నెల 29వ తేదీన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.20న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి తల్లిదండ్రుల జాబితాను పాఠశాలల్లో ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. ఈనెల 22న జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి 24న తుది జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశాం.శనివారం నోటిఫికేషన్ విడుదల చేసి ఈ నెల 29న ఎన్నికలు నిర్వహిస్తాం. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత పాటిస్తాం. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన రోజున సాయంత్రం చైర్మన్, వైస్ చైర్మన్లతో సమావేశం ఏర్పాటు చేస్తాం.