ఖలీల్వాడి, నవంబర్ 29: జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం చేశారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల, సీఎస్ఐ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా అర్బన్, రూరల్ నియోజకవర్గాలకు ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. బోధన్, ఆర్మూర్, భీమ్గల్ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని అందజేశారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు 144 సెక్షన్ విధించారు.
జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాలకు 1549 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆర్మూర్లో 217 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. 2,063,44 మంది ఓటర్లు, బోధన్లో 246 పోలింగ్ బూత్లు ఉండగా.. 2,15,963 మంది, బాన్సువాడలో 258 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. 1,92,841 మంది ఓటర్లు ఉన్నారు. నిజామాబాద్ అర్బన్లో 289 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. 2,86,766 మంది ఓటర్లు, నిజామాబాద్ రూరల్లో 293 పోలింగ్ బూత్లకు 2,48,269 మంది, బాల్కొండలో 246 పోలింగ్ కేంద్రాలు ఉండగా 2,15,628 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మొత్తం పురుషులు 6,47149 మంది, మహిళలు 7,18,603 మంది, ట్రాన్స్జెండర్లు 59 మంది ఉన్నారు.
పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని తరలించడానికి ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో అందజేసిన ఎన్నికల సామగ్రితో పోలింగ్ సిబ్బంది వారికి కేటాయించిన కేంద్రాలకు తరలివెళ్లారు. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ , నిజామాబాద్ రూరల్, బోధన్, బాన్సువాడ, బాల్కొండ సెగ్మెంట్ల పరిధిలోని 833 ప్రాంతాల్లో మొత్తం 1549 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1864 మంది పీవోలు, 1867 మంది ఏపీవోలు, వోపీవోలు 3727 మంది కలుపుకొని మొత్తం 7458 మందిని పోలింగ్ విధుల కోసం కేటాయించారు.