Bodhan |శక్కర్ నగర్ : నాటిన ప్రతీ మొక్కను సరంక్షించాలని బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మావతి అన్నారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆమె అధికారులు, కౌన్సిలర్లతో కలిసి గురువారం వివిధ రకాల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాలకు చెందిన ప్రిన్సిపాల్ అధ్యాపకులు నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలను విద్యార్థులకు అప్పగించాలని అన్నారు. నాటిన మొక్కలు ఏపుగా పెరిగి వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు దోహదం చేస్తాయని ఆమె అన్నారు.
మొక్కలు నాటడం ముఖ్యం కాదని, నాటిన ప్రతీ మొక్క సంరక్షించాలని, ఇందుకు మనమందరం బాధ్యతగా మెదలాలని పద్మావతి అన్నారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో సుమారు వందకు పైగా వివిధ రకాల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, కౌన్సిలర్లు తూము శరత్ రెడ్డి, అంకుదామోదర్, గుమ్ముల అశోక్ రెడ్డి నాయకులు పాషా మొయినొద్దీన్, తలారి నవీన్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.