నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 17 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న రాజారాం స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈవెంట్స్ కొనసాగుతున్నాయి. తొమ్మిదో రోజైన శనివారం ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఈవెంట్స్.. సాయంత్రం వరకు కమిషనర్ ఆఫ్ పోలీస్ కేఆర్.నాగరాజు పర్యవేక్షణలో కొనసాగాయి. తొమ్మిదో రోజు 1,202 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. 1,046 మంది హాజరయ్యారు. ఎక్కడా మానవ ప్రమేయం లేకుండా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్ (ఆర్ఎఫ్ఐడీ) ప్యాడ్లను వినియోగించారు. ఉదయం అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్, బయోమెట్రిక్తో పాటు ఎత్తు, బరువును కొలిచారు. అర్హత సాధించిన అభ్యర్థులకు కొంత సమయం విశ్రాంతి ఇచ్చి తర్వాత ఈవెంట్స్ నిర్వహించారు.
1,600 మీటర్ల పరుగు పందెంతో పాటు షాట్పుట్, లాంగ్ జంప్ నిర్వహించారు. ఈవెంట్స్లో 520 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు సీపీ వెల్లడించారు. గ్రౌండ్లో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టారు. అంబులెన్స్ను ఏర్పాటు చేసి వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచారు.
నాగారం రాజారాం స్టేడియంలో నిర్వహించే ఈవెంట్స్కు ఉమ్మడి జిల్లా నుంచి వస్తున్న అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. స్టేడియానికి వెళ్లేందుకు రూట్ సులువుగా తెలిసేందుకు ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ ఆధ్వర్యంలో బోర్డులను ఏర్పాటు చేయించారు. అభ్యర్థుల వాహనాలను పార్కింగ్ చేసేందుకు ప్రత్యేకంగా పార్కింగ్ జోన్ను ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ బాబు, అదనపు డీసీపీ గిరిరాజు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, సీసీఎస్, హోంగార్డ్స్, ట్రాఫిక్, సీటీసీ ఏసీపీలు ఏ.వెంకటేశ్వర్, ఆర్.ప్రభాకర్ రావు, కేఎం.కిరణ్ కుమార్, రమేశ్, శ్రీనివాస్, నారాయణ, శ్రావణ్కుమార్, ఏఆర్ ఏసీపీ సంతోష్, కామారెడ్డి ఏఆర్ డీఎస్పీ ఉదయ్కృష్ణ, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, జిల్లా పరిపాలనా అధికారి రామారావు, మ్యాగ్నిటిక్ ఇన్ఫోటిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్చార్జి మణికంఠ, ఎన్ఐబీ సీఐ ముఖీద్ పాషా, అన్ని డివిజన్ల సీఐలు, ఎస్సైలు, సూపరింటెండెంట్లు శంకర్, శ్రీనివాస్, మహ్మద్ మక్సూద్ హైమద్, గోవింద్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు పి.శ్రీశైలం, ఈ సాఫ్ట్ ఇన్చార్జి కె.వంశీ చక్రవర్తి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లతో పాటు ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.