]వర్ని, ఫిబ్రవరి 21: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 70రోజులు కావస్తున్నా ఎన్నికల హామీలు ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వర్ని, చందూర్, మోస్రా, రుద్రూరు, కోటగిరి మండలాలకు చెందిన 166మంది లబ్ధిదారులకు బుధవారం వర్ని మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో 13లక్షల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద రూ.11వేల కోట్లను పంపిణీ చేశామన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో 16వేల మందికి రూ.130కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. ఇప్పటికీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంజూరు చేసిన కల్యాణలక్ష్మి చెక్కులనే పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ఇస్తామన్న రూ.లక్షతోపాటు తులం బంగారం హామీ ఇప్పటి వరకు ఆచరణకు నోచుకోలేదని విమర్శించారు.
మహిళలకు రూ.2500, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్, రైతుబంధు, రుణమాఫీ, రూ.4వేల పింఛన్లాంటి హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటి వరకు వాటి ఊసే ఎత్తలేదని, ఇండ్ల కోసం 84లక్షల దరఖాస్తులు వచ్చాయని వాటికి బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించలేదన్నారు. బాన్సువాడ, వర్ని, కోటగిరిలో దవాఖానలు నిర్మించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో వర్ని, రుద్రూరు జడ్పీటీసీలు బర్దావల్ హరిదాస్, నరోజి గంగారాం, బోధన్ ఆర్డీవో రాజాగౌడ్, రైతుబంధు సమితి వర్ని మండల అధ్యక్షుడు సింగంపల్లి గంగారాం, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు దండ్ల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.