రుద్రూర్, మే 5 : దేశసేవే కాదు.. మానవ సేవలోనూ ముందుంటామని ఆ వీర జవాన్లు నిరూపిస్తున్నారు. అక్కడ దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పౌరులకు భద్రత కల్పిస్తున్నారు. మరోవైపు ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి పేదలకు అండగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. రుద్రూర్ మండలం అక్బర్నగర్ గ్రామానికి చెందిన ఏడుగురు యువకులు ఆర్మీలో ఉద్యోగాలు సాధించారు. దేశ భద్రతలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న వారు.. అంతటితోనే సంతృప్తి చెందకుండా సమాజానికి ఇంకా ఏదైనా చేయాలనే తపనతో జై జవాన్ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. తమ సంపాదనలో కొంత పేదల కోసం ఖర్చు చేస్తున్నారు. అభాగ్యులకు బాసటగా నిలుస్తున్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు, విద్యార్థులకు నోట్బుక్కులు, స్కూల్ బ్యాగులు, నిరాశ్రయుల ఆకలి తీర్చేందుకు ఆహారం, పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. స్వగ్రామంలో ప్రారంభించిన ‘జై జవాన్’ సేవలను క్రమంగా మండల స్థాయికి విస్తరించి అందరి మన్ననలు పొందుతున్నారు.
మానవసేవతో చాలా సంతోషంగా ఉంది..
దేశసేవ చేయాలనే నా కల ఆర్మీలో ఉద్యోగం సాధించడంతో నెరవేరింది. దీంతోపాటు మానవ సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. మిత్రులతో కలిసి సమాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. పేదలకు సాయం చేయడంలో ఎంతో సంతృప్తి ఉంటుంది.
-మెహబూబ్, ఆర్మీ జవాన్
గ్రామస్తుల సహకారంతో సేవలను విస్తరిస్తాం..
పేదలకు సేవ చేయాలనే ఆలోచనతోనే జై జవాన్ సంస్థను ఏర్పాటు చేశాం. ఏడుగురు స్నేహితులం కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అభాగ్యులకు అండగా నిలుస్తున్న మమ్మల్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. గ్రామస్తుల సహకారంతో మా సేవలను మరింత విస్తరిస్తాం.
-మశ్చేందర్, ఆర్మీ జవాన్