కోటగిరి, నవంబర్ 24: కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో చదువుకునే బాలికలకు మరింత భరోసా కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నాణ్యమైన విద్య, వసతులు కల్పిస్తున్నప్పటికీ ఇటీవల కొన్ని పాఠశాలల్లో బాలికలు ఆనారోగ్యం బారినపడిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై పిల్లల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో బాలికల విద్యకు, వారి ఆరోగ్యానికి పూర్తి భరోసా కల్పించేలా నిరంతర పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పేరోల్ యాప్ను తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా విద్యార్థినుల ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు.
పారదర్శకత కోసం అందులోనే హాజరు నమోదు చేపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 25 కేజీబీవీలు ఉండగా 5,696 మంది విద్యార్థినులు చదువుతున్నారు. వారి ఆరోగ్య పర్యవేక్షణకు ఇప్పటికే ప్రతి కేజీబీవీలో ఏఎన్ఎంను నియమించారు. వీరు నిత్యం విద్యార్థినులను పరిశీలన చేయడంతోపాటు అవసరమైన వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతోపాటు బాలికల ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు పేరోల్ యాప్లో నమోదు చేస్తున్నారు.
పేరోల్ యాప్లో ఆరోగ్య వివరాలు
కేజీబీవీల్లో బోధన, బోధనేతర సిబ్బంది హాజరు విషయంపై విద్యాశాఖ పేరోల్ యాప్ను రూపొందించింది. ప్రస్తుతం దానిని విద్యార్థుల ఆరోగ్య వివరాలు నమోదు చేసేలా అప్డేట్ చేశారు. వారికిచ్చిన లాగిన్తో యాప్ను ప్రారంభించి ప్రతిరోజూ ఉదయం బాలికల ఆరోగ్య వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా 11 రకాల రుగ్మతులను పేర్కొంటూ బాలికలు పడుతున్న ఇబ్బందులను విద్యాశాఖ అధికారులు తెలుసుకుంటున్నారు. సాధారణ జ్వరం, జలుబు, దగ్గు, శ్వాసలో ఇబ్బంది, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, అలర్జీ, బలహీనంగా ఉండడం, టైఫాయిడ్, డెంగీ, మలేరియా వంటి జ్వరాలతో బాధపడుతుంటే ఏఎన్ఎం గమనించి కేజీబీవీ ఎస్వోకు సమాచారం ఇస్తారు.
పేరోల్ యాప్లో విద్యార్థి వివరాల్లో అనారోగ్య సమస్యలను నమోదు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటే టిక్ మార్క్ చేసి ఎస్ అని పేర్కొంటున్నారు. ఈ విధానం ద్వారా విద్యార్థుల హాజరుతోపాటు ఆరోగ్య పరిస్థితిని మదింపు చేసే అవకాశం ఉంటుంది. రెండు,మూడు రోజులుగా అనారోగ్యంగా ఉన్నట్లు నమోదైతే వారిని సమీపంలోని వైద్య ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లడం లేదా తల్లిదండ్రులకు సమాచారం అందిస్తారు.
విద్యార్థినుల వివరాలు నమోదు చేస్తున్నాం..
ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పేరోల్ యాప్లో విద్యార్థినుల ఆరోగ్య వివరాలను నమోదు చేస్తున్నాం. దీని ద్వారా కేజీబీవీల్లో బాలికల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుకలుగుతుంది. అవసరమైన చోట వైద్య సేవలు అందించాలని ఎస్వోలకు సూచనలు ఇస్తున్నాం.
– వనిత, జిల్లా సెక్టోరియల్అధికారిణి, నిజామాబాద్