కేంద్రం తీసుకొచ్చిన భారత న్యాయ సంహిత చట్టంలో ‘హిట్ అండ్ రన్’ కేసుల్లో నిబంధనలను కఠినతరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ లారీ, ట్రక్కు డ్రైవర్లు మంగళవారం సమ్మె నిర్వహించారు. దీంతో పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లు సైతం ఎక్కడిక్కకడే నిలిచిపోయాయి. ఈ వార్త దావానంలా వ్యాపించడంతో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడనుందనే భయంతో వాహనదారులు బంకుల వైపు పరుగులు పెట్టారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో రద్దీ ఏర్పడింది. ద్విచక్ర వాహనాలతోపాటు కార్లు, మినీ గూడ్స్, ఇతర వాహనాలు కిక్కిరిసిపోయాయి. కొందరు వాహనదారులు ట్యాంక్ ఫుల్ చేయించుకోవడంతోపాటు బాటిళ్లలో సైతం తీసుకెళ్లారు. పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి.
ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం యాసంగి వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. దీంతో పొలం దమ్ము చేసేందుకు ట్రాక్టర్లకు డీజిల్ అవసరం ఉంటుంది. రోజుకు ఒక్కో ట్రాక్టర్కు సుమారు 50 లీటర్ల డీజిల్ అవసరం కాగా రాబోయే ఐదు రోజుల పాటు డ్రైవర్ల సమ్మె దృష్ట్యా డీజిల్ అందుబాటులో ఉండదనే ఉద్దేశంతో రైతులు ఆందోళన చెందారు. సరిగ్గా అదను సమయంలోనే ఇంధన కొరత మూలంగా నాట్లు వేసేందుకు ఇబ్బంది ఏర్పడుతుందని ఒకవైపు రైతులు, మరోవైపు ట్రాక్టర్ డ్రైవర్లలో టెన్షన్ నెలకొన్నది. దీంతో డీజిల్ డబ్బాలతో బంకులకు పరుగులు పెట్టారు.
కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ట్రక్కు డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. కేంద్రం ఇటీవల న్యాయ శిక్షాస్మృతుల్లో భారీగా మార్పులు చేస్తూ మూడు చట్టాలను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా భారతీయ న్యాయ సంహిత చట్టంలో ‘హిట్ అండ్ రన్’ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనపై ట్రక్కు డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)ప్రకారం నిర్లక్ష్యంగా వాహనం నడిపి, ఎవరైనా చనిపోవడానికి కారణమైతే గరిష్టంగా రెండేళ్ల వరకూ జైలు శిక్ష ఉండేది. అయితే, కేంద్రం తాజాగా తీసుకొచ్చిన చట్టం ప్రకారం.. హిట్ అండ్ రన్, ర్యాష్ డ్రైవింగ్ కేసుల్లో గరిష్టంగా పదేళ్ల జైలు, రూ.7 లక్షల వరకూ జరిమానా విధించే అవకాశముంది. ఈ నిబంధనను నిరసిస్తూ ట్రక్కు డ్రైవర్లు దేశవ్యాప్తంగా ఆందోళన బాట పట్టారు. ఫలితంగా పెట్రో ఉత్పత్తులు తరలించే ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. స్టాక్ రాకపోవడం, బంకుల్లో నిల్వ ఉన్న ఇంధనం అయిపోవడంతో పెట్రోల్, డీజిల్కు కొరత ఏర్పడింది.
రుద్రూర్, జనవరి 2: లారీలు, ట్రక్కు డ్రైవర్ల సమ్మెతో పెట్రోల్ కూడా దొరకదని తెలిసింది. దీంతో వెంటనే బైక్ తీసుకొని బంకుకు వచ్చా ను. నా మాదిరే చాలా మంది వాహనాల్లో పెట్రోల్ పోయించుకునేందుకు లైన్లలో నిల్చున్నారు. మా దగ్గర ఉన్న బంకుల్లో ఎక్కడ చూసినా బైకులు, కార్లే కనిపిస్తున్నాయి.
రుద్రూర్, జనవరి 2: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలకు వ్యతిరేకంగా లారీ డ్రైవర్లు సమ్మె చేస్తున్నారని తెలిసింది. పెట్రోల్, డీజిల్, కూరగాయలు, ఇతరత్రా వాటిని తీసుకొచ్చే లారీల డ్రైవర్లు సమ్మె చేస్తే మేమంతా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ప్రజలు ఇబ్బందులకు గురికాకముందే కేంద్రం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
డోంగ్లి, జనవరి 2: నాకు వ్యవసాయ పనుల కోసం పెట్రోల్ అవసరం. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు స్ట్రైక్ చేస్తుం డ్రు.. పెట్రోల్ దొరకదని ఊర్లో పబ్లిక్ చెప్పిండ్రు. వెం టనే బంకుకు వచ్చిన. ఇక్కడ చూస్తే మస్తు మంది లైన్ల నిల్చున్నరు. రెండు గంటలు లైన్లలో నిల్చుంటే నా వంతు వచ్చింది.