నస్రుల్లాబాద్, మే 17: రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలకు రూ.12కోట్లతో నూతనంగా మంజూరైన డార్మిటరీ భవన నిర్మాణానికి బుధవారం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గిరిజన గురుకులంలో ఇంటర్ వరకు చదువుకునేలా అన్ని హంగులతో పాఠశాల భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయుల కోసం ఎనిమిది క్వార్లర్లు కూడా కట్టిస్తామని చెప్పారు. బాన్సువాడ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా ఉండడంతో బాలికల కోసం హన్మాజిపేట్, కోనాపూర్ మధ్యలో పాఠశాల గిరిజన బాలికల పాఠశాల మంజూరైదన్నారు.
నస్రుల్లాబాద్, రుద్రూర్, మోస్రా, చందూర్ మండలకేంద్రాల్లో రూ.కోటి నిధులతో సమీకృత భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. అనంతరం మండలంలోని కొచ్చెరు మైసమ్మ ఆలయానికి వెళ్లారు. అక్కడ భక్తుల సౌకర్యార్థం సీసీ రోడ్లకు రూ.40 లక్షలు, నస్రుల్లాబాద్ మండలకేంద్రం నుంచి లింగంపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. కోటీ 35లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. కాటేజీల కోసం రూ. కోటీ 50 లక్షల మేర ప్రతిపాదనలు తెప్పించి మంజూరు చేస్తామన్నారు. అనంతరం గిరిజన గురుకుల పాఠశాలలో నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్, ఎంపీపీ విఠల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మాజిద్, తహసీల్దార్ భావయ్య, నాయకులు పాల్గొన్నారు.
స్పీకర్.. రిలాక్స్
నిత్యం బిజీబిజీగా ఉండే శాసన సభాపతి పోచారం అంకోల్ క్యాంపు వద్ద రిలాక్స్ అయ్యారు. నస్రుల్లాబాద్ నుంచి బాన్సువాడ పట్టణానికి వెళ్తుండగా మధ్యలో కొంతసేపు ఆగి చెరుకు రసం తాగారు. గ్రామస్తులు, నాయకులతో మాట్లాడుతూ సేదతీరారు.