తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. వేసవి ప్రారంభంలోనే తాగునీటి కటకట తీవ్రమవుతున్నది. గుక్కెడు మంచినీరు కోసం జనం నానాపాట్లు పడుతున్నారు. ఇక ఏప్రిల్, మే నెలల్లో నీటి ఎద్దడిని ఎలా ఎదుర్కోవాలన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
– కోటగిరి, మార్చి 6
ఎండాకాలం ఆరంభంలోనే కన్నీటి కష్టాలు ప్రారంభ మయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని పలు గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య షురూ అయ్యింది. కోటగిరి మండలం నాచుపల్లి తండాలో ప్రజలు తాగునీటి కోసం తిప్పలు పడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. కానీ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెల్లో తాగునీటి కష్టాలపై దృష్టి సారించలేకపోయిందని ప్రజలు వాపోతున్నారు. నాచుపల్లి తండాలో వారంరోజుల క్రితం బోరుమోటార్ పాడైపోవడంతో గ్రామస్తులు తాగునీటి కోసం నానాకష్టాలు పడుతున్నారు. ప్రతి రోజూ ఉదయం గ్రామ సమీపంలోని వ్యవసాయ బోరుబావుల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకొని గొంతు తడుపుకుంటున్నామని గిరిజనులు చెబుతున్నారు.
గ్రామంలో తాగునీటి కోసం రూ.లక్షలు వెచ్చించి నీటి ట్యాంకులు నిర్మించినా.. అవి ఏ మాత్రం ఉపయోగపడడం లేదు. అధికారులు మిషన్ భగీరథ నీరు అందిస్తామని చెప్పినా ఇంటింటికీ రావడం లేదు. ఒకవేళ వచ్చిన వారానికోసారి, మూడు రోజులకోసారి వస్తాయని, అది కూడా అరగంట మాత్రమేనని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రతిరోజూ మిషన్ భగీరథ నీరు వస్తే వాటిని పట్టుకుంటామని గిరిజనులు అంటున్నారు. మూడు రోజులకోసారి సరఫరా చేయడంతో నీటిలో పురుగులు వస్తున్నాయని పేర్కొంటున్నారు.
నాచుపల్లి తండాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నదని పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తండాలో ఉన్న బోరు వారం రోజుల క్రితం పాడైపోయిందని, సమాచారం ఇచ్చినా మరమ్మతులు చేయించడం లేదని తండావాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. ఈ విషయమై కోటగిరి ఎంపీడీవో మనోహర్రెడ్డిని వివరణ కోరగా.. నాచుపల్లితండాలో ఉన్న బోరు పాడైందని వెంటనే కార్యదర్శితో మాట్లాడి మరమ్మతులు చేయించి సమస్యను పరిష్కరిస్తామన్నారు.
మాది కోటగిరి మండ లం నాచుపల్లి తం డా. గత ప్రభుత్వ హ యాంలో తాగునీటి సమస్య ఎన్నడూ రా లేదు. గిప్పుడు తాగునీటి కోసం నానా కష్టమవుతున్నది. తండాలో ఉన్న బోరు పాడైంది. దానిని రిపేర్ చేస్తలేరు. పొద్దున లేవగానే పొలాల కాడికి పోయి నీళ్లు తెచ్చుకుంటున్నాం.
– దూరిబాయి, నాచుపల్లితండా, కోటగిరి
నాచుపల్లితండాలో తాగునీరు దొరకడం లేదు. బోరు పాడైపోయి వారం రోజు లు అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రిపేర్ చేస్తలేరు. రోజూ పొద్దున నీటి కష్టాలు తప్పడం లేదు. పశువులకు కూడా తాగడానికి నీళ్లు దొరకడం లేదు. అధికారులు స్పందించి తండాలో తాగునీటి సమస్యను పరిష్కరించాలి.
– హీరిబాయి, నాచుపల్లితండా, కోటగిరి