ధర్పల్లి, ఫిబ్రవరి 2 : ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలో గంజాయి, డ్రగ్స్ సరఫరా, విక్రయాలను నియంత్రించామని, నేరాలను అదుపులోకి తీసుకొచ్చామని జిల్లా పోలీసు కమిషనర్ నాగరాజు తెలిపారు. మండలకేంద్రంలోని భీమ్గల్ రోడ్డు కోళ్ల ఫామ్ మూలమలుపు వద్ద రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడిన విషయం తెలుసుకున్న ఆయన.. గురువారం సాయంత్రం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ధర్పల్లి మండలంలోని కోళ్లఫారం మూలమలుపు వద్ద కొంతకాలంగా పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరిగి మృత్యువాతపడడంతో తాను ఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆర్అండ్బీ, పోలీసు అధికారులతో ప్రత్యేకంగా చర్చించి రోడ్డుకు ఇరువైపులా రెయిలింగ్ ఏర్పాటు చేయించడంతోపాటు రేడియం ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ప్రమాదభరితంగా ఉన్న మూలమలుపును నేరుగా రోడ్డును ఏర్పాటు చేయించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఆర్అండ్బీ ఈఈతో చర్చిస్తామని చెప్పారు. ధర్పల్లి పెద్దమ్మ ఆలయ మూలమలుపు వద్ద సైతం ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
కమాండ్ కంట్రోల్కు జిల్లా నుంచి 163 కెమెరాల అనుసంధానం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఇటీవల ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్కు జిల్లా నుంచి 163 సీసీ కెమెరాలను అనుసంధానం చేసినట్లు ఈ సందర్భంగా సీపీ వెల్లడించారు. పోలీసుశాఖ పనితీరులో రాచకొండ పోలీసు కమిషనరేట్ తర్వాత స్థానంలో నిజామాబాద్ జిల్లా నిలిచిందని తెలిపారు. జిల్లాలో పోలీసు అధికారులు, సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, ఆర్అండ్బీ డీఈ సుధీర్, ధర్పల్లి సీఐ సైదా, శ్రీశైలం, ఎస్సై వంశీకృష్ణారెడ్డి, సిబ్బంది ఉన్నారు.