కోటగిరి, జూన్ 24: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పోషకాహారం అందించే కార్యక్రమంలో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి రాగిజావ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20న నిర్వహించిన విద్యాదినోత్సవంలో ప్రయోగాత్మకంగా జిల్లాకు చెందిన దాదాపు 5029 మంది విద్యార్థులకు రాగిజావను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. జూన్ వరకు ఎంపిక చేసిన పాఠశాలల విద్యార్థులకే రాగిజావ అందిస్తున్నారు. జూలై 1వ తేదీ నుంచి 1-10 వ తరగతి విద్యార్థులకు అందించనున్నారు.
వారానికి మూడు రోజులు..
ప్రస్తుతం వారానికి మూడు రోజులు రాగిజావను అందించేలా విద్యాశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రాగి పౌడర్, బెల్లం పౌడర్ను జిల్లా కేంద్రాలకు సరఫరా చేశారు. అక్కడి నుంచి మండల కేంద్రాలకు, పాఠశాలల మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు సరఫరా చేశారు. వారు దాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు.
జిల్లాలో 5,029 మందికి..
జిల్లాలో ప్రస్తుతం మొదటి విడుతలో భాగంగా 41 ప్రభుత్వ పాఠశాలల్లో 5,029 మంది విద్యార్థులకు రాగిజావను అందిస్తున్నారు. జూలై ఒకటి నుంచి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 1,23,590 మంది విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందిస్తారు. రాగి, బెల్లం పౌడర్ను మండలాలకు చేరవేసే కార్యక్రమాన్ని గత ఆదివారం నాటికి పూర్తి చేశారు. సోమవారం వాటిని ఎంపిక చేసిన పాఠశాలలకు సరఫరా చేశారు. ప్రతి రోజూ ఉదయం పిల్లలకు రాగిజావ అందిస్తున్నారు.
లోపాన్ని అధిగమించేలా..
ఫోర్టిఫైడ్ రాగి పిండి, బెల్లం మిశ్రమంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. జావ తయారీకి వినియోగించే మిశ్రమంలో రాగి, బెల్లం, సోయా, బియ్యం, దాల్చిన చెక్క పసుపు ఉప్పు తదితరవి ఉంటాయి. వాటిని పొడిగా చేసి ‘సాయి ష్యూర్’ పేరిట ప్యాకెట్లను పాఠశాలలకు అందించారు. వీటిలో కార్బొహైడ్రేడ్ కాల్షియం, మెగ్నీషియం, వివిధ రకాల విటమిన్లు, ఫైబర్లు, ఐరన్ దాగి ఉన్నాయి. విద్యార్థులకు ఉపకరించనున్నాయి. సక్రమంగా అందిస్తే పోషకాహార లోపం సమస్యను అధిగమించవచ్చు.