డిచ్పల్లి, మే 12 : తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా తీరు మారలేదు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన పాలక మండలి (ఈసీ) 58వ సమావేశానికి హాజరు కాలేదు. ఈసీతో కలిసి పని చేస్తానని, భేటీకి హాజరవుతానని ఇటీవల ప్రకటించిన వీసీ.. చివరకు సమావేశానికి వెళ్లకుండా డుమ్మా కొట్టారు. దీంతో విద్యాశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ అధ్యక్షతన ఈసీ భేటీ జరిగింది. వీసీ తీరుపై సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. 53వ పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు.. వీసీ గుప్తా చేపట్టిన అన్ని రకాల నియామకాలను రద్దు చేస్తూ మరోసారి తీర్మానం చేశారు. నియామకాలన్నీ అక్రమమని, ఈ వ్యవహారంపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించారు. జీతాలు చెల్లించి ఉంటే వాటిని రికవరీ చేయాలని తీర్మానించారు. వీసీ నియమించిన మాజీ రిజిస్ట్రార్లు శివశంకర్, విద్యావర్ధిని.. ఈసీ అప్రూవల్ చేయని చెక్కులతో పాటు ఆర్థికపరమైన లావాదేవీలు జరిపితే, వారి వ్యక్తిగత అకౌంట్ నుంచి డబ్బులు రికవరీ చేయాలని రిజిస్ట్రార్ యాదగిరికి ఆదేశాలు జారీ చేశారు. టీయూ పాలకమండలి సభ్యులైన రవీందర్రెడ్డి, నసీం, ఆరతిలకు నిబంధనలకు విరుద్ధంగా గత రిజిస్ట్రార్ నిర్మలాదేవి జారీ చేసిన షోకాజ్ నోటీసులను రద్దు చేశారు.
తెలుగు డిపార్ట్మెంట్లో పుప్పాల రవికి పీహెచ్డీ డిగ్రీపై విచారణ జరపాలని ఈసీ సభ్యులు నిర్ణయించారు. దీంతో పాటు 2023లో చేపట్టిన పీహెచ్డీ అడ్మిషన్లపై విచారణ జరపాలని తీర్మానించారు. మే 25న మరోసారి టీయూ పాలక మండలి సమావేశం కావాలని నిర్ణయించారు.
తీరుమార్చుకోని వీసీ..
వర్సిటీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో వీసీ దిగి వచ్చారు. ఇక నుంచి పాలకమండలితో కలిసిమెలసి ఉండి, విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఈసీ సభ్యుల సమక్షంలో గత మంగళవారం ప్రకటించారు. అయితే, శుక్రవారం జరిగిన పాలక మండలి మీటింగ్కు డుమ్మా కొట్టడంతో ఆయన అసలు స్వరూపం బయటపడింది. శుక్రవారం నాటి ఈసీ మీటింగ్లో పాల్గొనాల్సింది పోయి.. గతంలో మాదిరిగానే మళ్లీ డుమ్మా కొట్టారు. ఈ వ్యవహారం ఈసీ సభ్యులకు మరింత ఆగ్రహం తెప్పించింది. పాలక మండలి సమావేశానికి వీసీ రాకపోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. అయితే, అవినీతికి పాల్పడడం వల్లే హాజరుకావడం లేదని ఈసీ సభ్యులు పేర్కొంటున్నారు.