కమ్మర్పల్లి, జనవరి 10: గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేయడంతో లబ్ధిదారులు బుధవారం ఆందోళనకు దిగారు. తహసీల్ కార్యాలయాల ఎదుట ధర్నాకు దిగారు. పథకాన్ని కొనసాగించాలని లేదంటే ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తే అందులో తమకు తొలి ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. బాల్కొండ నియోజకవర్గంలోని దాదాపు అన్ని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట లబ్ధిదారుల నిరసన కార్యక్రమాలు కొనసాగాయి.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో సొంతిల్లు లేని వారు ఉండకూడదన్న ఉద్దేశ్యంతో కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. రెండు పడక గదులు, హాల్, కిచెన్తో కూడిన ఇంటిని నిర్మించి పేదలకు అందించే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అవకాశమున్న చోట, నిర్మాణానికి స్థల లభ్యత దొరికిన చోట విడతల వారీగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాలను నిర్మించింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలను పారదర్శకంగా పూర్తి చేసి, ఇండ్లను అప్పగించింది. డబుల్ బెడ్రూం పథకం కింద ఉమ్మడి జిల్లాలో వేలాది మంది పేదల సొంతింటి కల నెరవేరింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామంటున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో తమకు అవకాశం లభిస్తుందో లేదోనని గృహలక్ష్మి లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో న్యాయం చేస్తామనే భరోసా ఏదీ కొత్త ప్రభుత్వం నుంచి రాలేదు. తమను కొత్త ప్రభుత్వంలో లబ్ధిదారులుగా గుర్తించే ప్రకటన చేస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తూ వచ్చినా ఎలాంటి ప్రకటనా రాలేదు. దీంతో బుధవారం తహసీల్ కార్యాలయాల ఎదుట నిరసనకు దిగారు. బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని తహసీల్ కార్యాలయాల వద్దకు లబ్ధిదారులు తరలివచ్చి ధర్నాకు దిగారు. తమను ఇందిరమ్మ ఇండ్ల పథకంలో తొలి లబ్ధిదారులుగా ప్రాధాన్యతనిస్తూ గుర్తించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ మేరకు తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. ఇదివరకే కేసీఆర్ ప్రభుత్వంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మంజూరైన ప్రజల సామూహిక అవసరాల అభివృద్ధి పనులను కొత్త ప్రభుత్వం రద్దు చేయడంతో ఆందోళనగా ఉన్న ప్రజలు.. తాజాగా గృహలక్ష్మి మంజూరీలను రద్దు చేయటంతో మరింత డీలా పడిపోయారు.
ఇంటి నిర్మాణాలు ప్రారంభించేలోపే శాసనసభ ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల తర్వాత తమకు మంజూరైన ఇండ్లను నిర్మాణాన్ని ప్రారంభించుకోవాలని లబ్ధిదారులు భావించారు. అయితే, తమ సొంతింటి కల తీరబోతున్నదన్న ఆనందంలో ఉన్న పేదలకు.. నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ సర్కార్ షాకిచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన గృహలక్ష్మి ఇండ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో గృహలక్ష్మి లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. సొంతింటి కల తీరబోతుందన్న ఆనందం కొద్ది రోజులైనా లేకుండా పోవడంతో నిరాశ మొదలైంది.
మరోవైపు, సొంత జాగా ఉండి, ఇల్లు లేని పేదల కోసం కేసీఆర్ సర్కారు గృహలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది. ఇల్లు నిర్మాణానికి రూ.3లక్షలు ఆర్థిక సాయాన్ని అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. నియోజకవర్గానికి 3 వేల మందికి ఇందిరమ్మ ఇండ్ల పథకం అందించేలా కార్యాచరణ రూపొందించింది. ఆ మేరకు అన్ని నియోజకవర్గాల్లో జాగా ఉండి ఇల్లు లేని పేదలను గుర్తించి ఇళ్లను మంజూరు చేసింది. గ్రామ గ్రామాన ఎంతో మంది ఈ పథకానికి ఎంపిక కాగా, ప్రొసిడింగ్ కాపీల అందజేత కూడా పూర్తయింది.