నస్రుల్లాబాద్/ కామారెడ్డి/బాన్సువాడ, అక్టోబర్ 8: స్వరాష్ట్రంలోనే గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో గ్రామాలకు పెద్దమొత్తంలో నిధులు వస్తున్నాయని తెలిపారు. ఆదివారం ఆయన జిల్లా కేంద్రంతోపాటు నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాల్లో పర్యటించారు. పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. బీర్కూర్ మండలం బరంగేడ్గి గ్రామంలో రూ.28 లక్షలతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల అదనపు గదులను ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని బైపాస్ రహదారి పక్కన బంజారా భవన్ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్తో కలిసి భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో స్పీకర్ మాట్లాడుతూ.. సమైక్యపాలనలో గ్రామాల అభివృద్ధి కోసం అరకొర నిధులు వచ్చేవని, నేడు ఒక్కో గ్రామానికి ఏడాదికి కోట్ల రూపాయలు వస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ వచ్చాకే రైతుబంధు, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇండ్లు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, ఉచిత విద్యుత్, ఆసరా పింఛన్లు తదితర సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు ఈ పథకాలు లేవన్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అ ని పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానల్లోనే అత్యధికంగా సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు. బాన్సువాడ ప్రాంత రైతాంగం దేశానికి అన్నంపెట్టే స్థాయికి ఎదగాలన్నారు. నియోజకవర్గంలో ప్రజలు, రైతాంగానికి మంచి చేసే నాయకుడిని కాపాడుకోవాలన్నారు. కొన్ని పార్టీల నాయకులు ఓట్ల కోసం అబద్ధాలు ఆడుతున్నారని అన్నా రు. ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ సంక్షేమ పథకాలను ఎందుకు అమలుచేయడంలేదని ప్రశ్నించారు. ప్రజలకు అంతా తెలుసని, వారి మాయమాటలు నమ్మరని అన్నారు.
బంజారాలు ఉన్నత స్థాయికి ఎదగాలి
జిల్లా కేంద్రంలోని బైపాస్ రహదారి పక్కన బంజారా భవన్, మూడు మందిరాల నిర్మాణం కోసం ప్రభుత్వం ఎకరం భూమిని కేటాయించిందని స్పీకర్ తెలిపారు. వీటి నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం త్వరలోనే సీఎం కేసీఆర్ను కలుస్తానని చెప్పారు. బంజారాలు చదువుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. గిరిజన బాల, బాలికల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాలో పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే 5,013 మంది బంజారాలకు 11,365 ఎకరాలకు సంబంధించిన ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చామని తెలిపారు. ఈ భూములకు రైతుబంధు, రైతుబీమా వర్తిస్తుందని చెప్పారు. మిగిలిన వారికి కూడా త్వరలో ఇప్పిస్తామన్నారు.
నియోజకవర్గంలోని అన్ని తండాల్లో జగదాంబ, సేవాలాల్ మహరాజ్ మందిరాల నిర్మాణానికి రూ. 20 కోట్లు మంజూరుచేసినుట్ల తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గానికి 11వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరైతే అందులో 2,570 ఇండ్లను బంజారాలకు కేటాయించినట్లు చెప్పారు. ప్రజలను కొంత మంది తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. మంచేదో, చెడేదో తెలుసుకొని, మంచి మనసుతో తమను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం బంజారా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పౌరాదేవి పీఠాధిపతి రామారావు మహరాజ్ మనవడు బాబూ సింగ్ మహరాజ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, బంజారా నాయకుడు బద్యానాయక్, లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గణేశ్ నాయక్, మోతీ సింగ్ నాయక్, ప్రవీణ్ నాయ క్, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.