వర్ని, ఫిబ్రవరి 27: రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతున్నదని, కానీ బీజేపీ నాయకులు ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి విమర్శించారు. మతాల పేరు తో గొడవలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం వర్ని మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సుమారు 500 మంది బీఆర్ఎస్లో చేరారు. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని తెలిపారు. అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని బీజేపీ నాయకులు విమర్శించడం వారి అవివేకానికి నిదర్శనమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజల కోసం తమ ప్రాణాలైనా అర్పిస్తామని, ఎవ రూ భయపడాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. ఎంపీ అర్వింద్ పసుపు బోర్డు తెస్తానని బాండ్పేపర్ రాసిచ్చి ఇప్పటికీ తేలేకపోయారన్నారు.
చెప్పుదెబ్బలకు సిద్ధమా?
తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే తల కోసుకుంటానని, నిరూపించలేక పోతే చెప్పు దెబ్బలు తింటావా అని బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకుడు మాల్యాద్రి రెడ్డికి సవాల్ విసిరారు. పోచారం బాన్సువాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే తాము నియోజకవర్గ ప్రజలకు సేవకులమని అన్నారు. తాము ఎమ్మెల్యేలుగా వ్యవహరించడంలేదన్నారు. సేవాలాల్ మహరాజ్ జయంతి, ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
రామ్రావ్ మహరాజ్, ఎన్టీఆర్తో పోచారం శ్రీనివాసరెడ్డికి ఉన్న అనుబంధం తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఆస్తికోసం బావను హత్య చేసి, జైలు జీవితం గడిపిన మాల్యాద్రిరెడ్డి.. మచ్చలేని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని విమర్శిస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. అంతకుముందు భాస్కర్రెడ్డి, పోచారం సురేందర్రెడ్డికి కార్యకర్తలు బైక్ ర్యాలీ ద్వారా ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, జడ్పీటీసీ బర్దావల్ హరిదాస్, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, కో -ఆప్షన్ సభ్యుడు కరీం, ఏఎంసీ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, సహకార సంఘాల అధ్యక్షులు నామాల సాయిబాబా, కృష్ణారెడ్డి, కనకారెడ్డి, సర్పంచులు రాజు, నాని బాబు, బీఆర్ఎస్ నాయకులు కల్లాలి గిరి, బాబు, నాగభూషణం, కులకర్ణి సంతోష్, సంజీవులు, నరెడ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.