కామారెడ్డి,డిసెంబర్ 10 : అవినీతిపై మాట్లాడే ముందు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డీసీసీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం ఎమ్మెల్యే మొదటి సారి మీడియా సమావేశం నిర్వహించి అభివృద్ధిపై మాట్లాడతారని ఆశించామని.. కానీ పూర్తిగా చౌకబారు మాటలకే పరిమితమయ్యారన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొ దట కమిటీలో సభ్యుడిగా ఎలా చేరాడని, అనంతరం మిత్రులైన అరోరా కాలేజీ యాజమాన్యానికి చెందిన వారిని దాంట్లో సభ్యుడిగా ఎలా చేర్చాడని ప్రశ్నించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన 26 ఎకరాల 15 గుంటలు వారికి అప్పనంగా అప్పజెప్పిన దాంట్లో వెంకటరమణారెడ్డి పాత్ర కీలకమన్నా రు. కళాశాలకు చెందిన 26 ఎకరాల భూములను యూకో బ్యాంకులో కుదవ పెట్టి రూ. ఏడు కోట్లు తీసుకున్నది వాస్తవం కాదా అన్ని ప్రశ్నించారు. మి గతా సొసైటీ సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి డిగ్రీ కళాశాలకు చెందిన భూములను బ్యాంకులో కుదవ పెట్టి అప్పు చేశారని.. దీనిపై కమిటీ సభ్యులు కోర్టు కు వెళ్లలేదా అని ప్రశ్నించారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని.. సమయం, స్ధలం చెబితే వెంకటరమణారెడ్డి అవినీతి బయటపెట్టడానికి అన్ని ఆధారాలతో సహా వస్తామని సవాల్ విసిరారు. ఇక ఓటమి గురించి మాట్లాడుతున్న ఆయన కామారెడ్డిలో కౌన్సిలర్గా కూడా గెలవలేదని.. మూడో స్థానంలో నిలిచాడన్నారు.
జడ్పీటీసీగా గెలిపించి జిల్లా పరిషత్ చైర్మన్ను చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా బీ ఫా మ్ ఇస్తే టీఆర్ఎస్కు అమ్ముకున్న దొంగ అని దు య్యబట్టారు. తన విద్యా సంస్థలను ముగ్గురికి అమ్మి, వారిని బెదిరించి తిరిగి తీసుకోలేదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడన్నారు. 15 సంవత్సరాల క్రితం విద్యుత్ శాఖలో అవినీతి జరిగిందంటున్నాడని.. మరి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. షబ్బీర్ అలీ వద్ద పని చేసే వ్యక్తిగత కార్యదర్శి మైనార్టీ విభాగంలో కాంట్రాక్ట్ వర్క్ చేసేవాడని.. అక్కడ మూడు సంవత్సరాల నుంచి జీతం రాకపోవడంతో షబ్బీర్ అలీ వద్ద జీతం చేస్తున్నాడని తెలిపారు. నాయక్ అనే వ్యక్తి ఏ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాడో అక్కడికి వెళ్లి అతని వ్యక్తిగత హాజరు పట్టికను పరిశీలిస్తే వాస్తవం తెలుస్తుందని అన్నారు. వెంకటరమణారెడ్డి జీవితమంతా అవినీతిమయమేనని.. షబ్బీర్ అలీ మంత్రిగా వస్తే అవినీతి చేసే అవకాశం దొరకదని కారుకూతలు కూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత డబ్బులు రూ.150 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తానని ప్రకటించాడన్నారు. ఆయన ఖర్చుపెట్టే వివరాలకు సంబంధించి శ్వేత పత్రం విడుదల చేయాలని అన్నారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, మాజీ సీడీసీ అధ్యక్షుడు అశోక్ రెడ్డి, జడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి, భిక్కనూర్ మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి, బీబీపేట్ మండల అధ్యక్షుడు సుతారి రమేశ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు నౌసీ లాల్, ఐరేని సందీప్, పంపరి లక్ష్మణ్, గోనె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.