సీజన్ ప్రారంభంలో వరుణుడు కరుణించకపోయినా వానకాలం సాగుకు అన్నదాతలు ఉత్సాహం చూపారు. అన్నదాతకు భరోసా కల్పించేందుకు పునరుజ్జీవ పథకంలో భాగంగా కాళేశ్వరం జలాలను ఎస్సారెస్పీకి తరలించారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు కూడా కాళేశ్వరం జలాలను తరలించేందుకు సీఎం కేసీఆర్ సర్కారు సిద్ధంగా ఉండడంతో రైతులకు కొండంత అండ దొరికింది. కాళేశ్వరం జలాల భరోసా.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు పంటల సాగులో నిమగ్నమయ్యారు. పంటలు చేతికొచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం సంభవించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి సాగు కాలాన్ని ముందుకు జరుపుకోవాలని సూచించింది. అందుకు తగినట్లుగానే విత్తనాలు, ఎరువులను ముందే అందుబాటులో ఉంచింది. పెట్టుబడి సాయాన్ని సైతం సీజన్ ప్రారంభంలోనే అందించింది. ఇటీవల కురిసిన భారీవర్షాలతో ఇబ్బందులు తలెత్తినా ప్రస్తుతం తెరిపినివ్వడంతో పంట సాగులో అన్నదాతలు బిజీగా మారారు. వానకాలంలో జిల్లాలో 5.13 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కాగా ఇందులో 4.18 లక్షల ఎకరాల్లో వరి వైపే రైతులు మొగ్గు చూపుతున్నారని వ్యవసాయశాఖ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.
-బోధన్, జూలై 30
బోధన్, జూలై 30 : ఈ వానాకాలం సీజన్లో వర్షాలు కురవడం ఆలస్యమైనప్పటికీ, గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, జిల్లాకు తరలివస్తున్న కాళేశ్వరం జలాలతో జిల్లాలో వానాకాలం పంటల సాగు జోరందుకున్నది.. సకాలంలో ఏమాత్రం వర్షాలు కురిసినా.. ప్రభుత్వం సంకల్పించిన ముందస్తు సాగులో జిల్లా రైతులు ఎంతో ముందజంలో ఉన్నారు. ప్రతికూల వాతావరణంలోనూ కేసీఆర్ సర్కార్పై ఉన్న నమ్మకంతో రైతులు పంటల సాగుకు ఉపక్రమించారు. ముంద స్తు సాగులో ఎంతో కొంత ప్రగతిని రైతులు చూపించారు. బోధన్ డివిజన్లోనైతే ముందస్తు సాగు జోరు కొనసాగింది. పంటల చివరి దశలో వడగండ్ల వర్షాలు, భారీ వర్షాలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుండడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి పంటల సాగు కాలాన్ని ముందుకు జరుపుకోవాలని రైతులకు సూచించింది.
ఈ ప్రకా రం వ్యవసాయశాఖ జిల్లాలోని పంటల విస్తీర్ణం, వాటికి కావాల్సిన విత్తనాలు, ఎరువులు తదితర ఏర్పాట్ల కోసం వానాకాలం పంటల యాక్షన్ ప్లాన్ను రూపొంచింది. ముందస్తు సాగుపై రైతువేదికల ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. వానాకాలం పంటల సాగు యాక్షన్ ప్లాన్కు అనుగుణంగా పంటలను సాగుచేసేలా రైతులను ప్రోత్సహించింది. వానాకాలం పంటల కోసం విత్తనాలను సీజన్ ప్రారంభానికి ముందే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎరువులను కూడా జిల్లాకు ముందస్తుగానే తీసుకువచ్చి బఫర్ స్టాక్లను ఉంచారు. అన్నింటికన్నా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి వానాకాలం సీజన్ ప్రారంభంలోనే ‘రైతుబంధు’ సాయాన్ని అందించడం రైతులకు ఎంతో ఉపయోగపడింది. ఇక, శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం కింద జిల్లాలోని ఆ ప్రాజెక్ట్ను నింపేందుకు కాళేశ్వరం జలాలు తరలివస్తుండడం, నిజాంసాగర్ ప్రాజెక్ట్కు కూడా కాళేశ్వరం జలాలు తరలించేందుకు కేసీఆర్ సర్కార్ సిద్ధంగా ఉండడంతో రైతులకు కొండంత భరోసా దొరికింది.
5.13 లక్షల ఎకరాల్లో వానాకాలం పంటలు
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగం అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలతో నిజామాబాద్ జిల్లాలో సాగు విస్తీర్ణం ప్రతీ ఏటా పెరుగుతూ వస్తున్నది. ఈ ఏడాది వానాకాలంలో 5 లక్షల 13 వేల 355 ఎకరాల్లో పంటల సాగు జరుగుతుందని వ్యవసాయశాఖ అంచనావేసింది. ఈ నెల 17వ తేదీ వరకు జిల్లాలోని 3 లక్షల 5 వేల 322 ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. మిగతా విస్తీర్ణంలో పంటలు వేసేందుకు రైతులు భూమిని సిద్ధంచేస్తున్నారు. ఈసారి కూడా జిల్లాలోని రైతులు వరి పంట వైపే మొగ్గుచూపుతున్నారు. జిల్లాలో మొత్తం 4,17,943 ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగానే ఇప్పటివరకు 1,83,374 ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. బోధన్ డివిజన్లో 80 శాతం మేరకు వరినాట్లు పూర్తవగా, నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్ల్లో వరి నాట్లు ఊపందుకున్నాయి. మరో వారం రోజుల్లో జిల్లాలో వరి నాట్లు పూర్తవుతాయని భావిస్తున్నారు. వరి తర్వాత మక్కజొన్న, సోయాబీన్ పంటలను రైతు లు ఎక్కువగా సాగుచేస్తున్నారు. జిల్లాలో సోయాబీన్ పంటను 58,714 ఎకరాల్లో సాగుచేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించగా, ఇప్పటికే 47,745 ఎకరాల్లో ఈ పంటను వేశారు. మరో వారం రోజుల వరకు సోయాబీన్ వేసేందుకు అవకాశం ఉంది. ఇక, మక్కజొన్న 32,185 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనావేయగా, అంతకుమించి 35,287 ఎకరాల్లో ఆ పంటను రైతులు సాగుచేశారు.
వానాకాలం ప్రారంభంలో వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు సోయాబీన్, మక్కజొన్న పంట వైపు మొగ్గుచూపారు. పత్తి పంటను 2,068 ఎకరాల్లో సాగుచేశారు. ఇక, కంది పంటను కూడా సుమారు 800 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. మిగతా విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. ప్రస్తుతం వేసిన సోయాబీన్ పంట కోత తర్వాత చాలామంది రైతులు ఆ భూముల్లో శనగ పంటను వేయనున్నా రు. ఇలా ఆరు నెలల వ్యవధిలోనే రెండు పంటల ఫలసాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. సోయాబీన్ పంటకు కూలీల ఖర్చు తక్కువగా ఉండడం, చీడపీడల బాధ లేకపోవడం, శ్రమ తక్కువగా ఉండడంతో పాటు స్వల్పకాలంలోనే.. అంటే వచ్చే నవంబర్లోగా ఆ పంట చేతికివస్తుంది. ఈ కారణంగా రైతులు సోయాబీన్ పంటను సాగుచేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తోడు కాళేశ్వరం జలాలతో భూగర్భజలాలు పెరుగుతుండడంతో బోర్ల కింద సాగవుతున్న పంటలకు కూడా ఢోకాలేదని రైతులు అంటున్నారు.
ఎరువులకు కొరత లేదు..
రైతులకు సకాలంలో విత్తనాలను అందుబాటులో ఉంచాం.. ఎరువులకు ఎటువంటి కొరత లేదు. డీలర్ల వద్ద ఎరువులను ఉంచడమే కాకుండా జిల్లాలో సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల బఫర్ స్టాక్లు ఉన్నాయి. ఎరువులను అవసరమున్నప్పుడే రైతులు కొనుగోలు చేయాలి. ఎరువులు దొరకవేమో అన్న ఆందోళన చెందడంతో ఇబ్బందులు ఏర్పడుతాయి. పంటల సాగులో రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తున్నాం.. రైతు వేదికలు ఇందుకు ఉపయోగపడుతున్నాయి.
-సంతోష్, ఏడీఏ, బోధన్
సర్కారుపై భరోసాతోనే వరి పంట వేశాం..
రైతులకు కేసీఆర్ సర్కార్పై భరోసా ఉంది. ఈ నమ్మకంతోనే వరి పంట వేసిన.. ఇప్పటికి మా అందరి పంటలు బాగున్నాయి. నాకు ఉన్న సొంత పొలం ఎకరంన్నరలో వరి వేసినం 15 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్న.. ఆ పొలంలో కూడా వరి పండిస్తున్న.. పంట మంచిగున్నది.. ఎరువులు కూడా అందుబాటులో దొరుకుతున్నయి.. అప్పటి పాలకులు ఉన్నప్పుడు గీ ఎరువుల కోసం క్యూలైన్లల్ల నిలబడుడు ఉంటుండె.. ఇప్పుడా బాధలు లేవు..
– పత్తి శ్రీనివాస్, రైతు, కోటగిరి
వరితో పాటు మక్కజొన్న సాగుచేస్తున్నాం..
మా కుటుంబానికి మొత్తం 40 ఎకరాల భూమి ఉంది. బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాం.. 24 గంటల ఉచిత కరెంట్ వస్తుండడంతో వర్షాల కోసం ఎదురుచూడకుండా వరి నాటేసినం. 20 ఎకరాల్ల వరి వేసినం మిగతా 20 ఎకరాల్లో మక్క పంట వేసినం. రెండు పంటలు బాగున్నాయి. చెరువులు, కుంటల్లో పుష్కలంగా నీళ్లు ఉంటున్నాయి. దీంతో భూగర్భజలాలు పడిపోకచ్చినయి. బోర్లు మంచిగా పోస్తున్నయి. ఈ ఏడు పంటలు బాగానే ఉంటాయి.
– గణేశ్ పటేల్, రైతు, బండారుపల్లి, బోధన్ మండలం