నిజాంసాగర్, డిసెంబర్ 6: నిండుకుండలా తొణికిసలాడుతున్న నిజాంసాగర్.. ఆయకట్టుకు భరోసానిస్తున్నది. ప్రాజెక్టులో ప్రస్తుతం 16.16 టీఎంసీల నీరుండడంతో పంటల సాగుకు రందీ లేకుండా పోయింది. దీంతో ఆయకట్టు రైతాంగం ఉత్సాహంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైంది. ఈ యాసంగిలో నిజాంసాగర్ మొదటి ఆయకట్టుతో పాటు అలీసాగర్ 49వ డిస్ట్రిబ్యూటరీ వరకు 1.45 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించనున్నారు. ఎన్ని తడులు ఇస్తారు, ఎప్పటి నుంచి నీటిని విడుదల చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాకున్నప్పటికీ రైతులు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే కొంత మంది రైతులు నార్లు పోశారు. నీటి విడుదల ప్రారంభం కాగానే నాట్లు వేసేందుకు సన్నద్ధంగా ఉన్నారు.
యాసంగి సాగుకు రైతన్నలు సిద్ధమవుతున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం యాసంగికి సరిపడా నీరు నిల్వ ఉండడంతో పంటల సాగుకు ఎలాంటి ఢోకా లేదని భరోసాతో ఉన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో పూర్థిస్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1403.86 అడుగుల (16.16 టీఎంసీలు) వద్ద ఉన్నది. దీంతో ఆయకట్టు కింద నిజాంసాగర్ నుంచి అలీసాగర్ వరకు సాగునీటికి ఇబ్బందులు దూరమయ్యాయి. దీంతో రైతన్నలు సంతోషంగా యాసంగి పంటల సాగుకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే ఆయకట్టు కింద తుకాలు సిద్ధం చేస్తూ, నాట్లు వేసేందుకు దుక్కులు దున్నుకుంటున్నారు.
ముందస్తు సాగుకు సన్నద్ధం
నిజాంసాగర్ ఆయకట్టు కింద నిజాంసాగర్, బాన్సువాడ, నస్రుల్లాబాద్, బీర్కూర్, వర్ని, రుద్రూ ర్, కోటగిరి, పొతంగల్,బోధన్ మండలాల్లో రైతన్నలు ముందస్తు సాగుకు సన్నద్ధమయ్యారు. వారం రోజుల క్రితం నారు మడికి నీరు అవసరం ఉండడం తో 800 క్యూసెక్కుల చొప్పున వారం రోజుల పాటు ఆయకట్టుకు ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టారు. దీంతో రైతులు నారుమడి సిద్ధం చేసుకొని నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
1.45 లక్షల ఎకరాల్లో సాగు
నిజాంసాగర్ మొదటి ఆయకట్టుతోపాటు అలీసాగర్ వరకు డిస్ట్రిబ్యూటరీ -49 వరకు 1.45లక్షల ఎకరాల్లో పంటల సాగు చేయనున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో 16 టీఎంసీల నీరు నిలువ ఉండడంతో ఆయకట్టు సాగుకు ఎలాంటి ఢోకాలేదనే ఉద్దేశంతో పూర్తిస్థాయిలో సాగుకు సిద్ధం అవుతున్నారు. నీటి పారుదల శాఖ అధికారులు సైతం డిస్ట్రిబ్యూటరీ -49 వరకు నీటిని విడుదల చేస్తామని డీఐబీ సమావేశంలో పేర్కొన్నారు. నీటి విడుదల, ఎన్ని తడులు అనే అంశాలపై చర్చించి త్వరలో నీటి విడుదల తేదీలను ప్రకటిస్తామని చెప్పడంతో రైతన్నలు సంతోషంగా ఉన్నారు. ఇప్పటికే ఆయకట్టు కింద వర్ని, రుద్రూర్, నస్రుల్లాబాద్, బోధన్, కోటగిరి, పొతంగల్ ప్రాంతాల్లో చాలా మంది రైతులు వరి నారుమళ్లు వేసుకొన్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా నీటి విడుదలను ప్రధాన కాలువ ద్వారా అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.