ఆర్మూర్ : వచ్చే యాసంగి సీజన్లో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను రైతులు సాగు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామం సొసైటీ ఆవరణలో గురువారం వరి పంటపై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే సీజన్లో వరి పంటకు బదులు వేరే పంట సాగయ్యే భూముల్లో కచ్చితంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలన్నారు. తప్పనిసరై వరి పంట బదులు వేరే పంట పండని భూముల్లో వరి పంట సన్నరకాలను రైతులు సాగు చేసుకోవాలన్నారు. యాసంగి సీజన్లో ఆరుతడి పంటలైన పొద్దుతిరుగుడు, వేరుశనగ, మొక్కజొన్న తదితర డిమాండ్ కలిగిన పంటలను వేసుకోవాలని సూచించారు.
ఖరీఫ్ సీజన్లో పండించిన వరిధాన్యాన్ని అధికారుల నిబంధనల మేరకు రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంకాపూర్ సర్పంచ్ మచ్చర్ల పూజితారెడ్డి, ఉపసర్పంచ్ మచ్చర్ల కిశోర్రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు, ఆర్మూర్ ఏడీఏ హరికృష్ణ, ఏఈఓ సవిత, ఎంపీటీసీలు ఎంసీ.గంగారెడ్డి, మంగ్లారం మహేందర్, రైతులు పాల్గొన్నారు.