రామగిరి, జూలై 18 : బనకచర్లపై కొన్ని నిర్ణయాలు జరిగాయని ఆం ధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి రామానాయుడు ప్రకటన చేసిన నేపథ్యంలో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రిపై ఉం దని, ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ప్రజలకు స్పష్టత ఇవ్వాలని సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. శుక్రవారం నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవన్లో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సమావేశానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. బనకచర్లపై సమావేశం జరిగి ఉంటే ఆ సమావేంలో తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్రానికి వరద, మిగులు జలాలపై స్పష్టమైన వాటాలను తేల్చాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య వివాదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందని విమర్శించారు.
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లను ఆమోదించి కేంద్రానికి పంపారు. ఆ బిల్లును మూడు నెలల్లోగా తేల్చాలని సుప్రీంకోర్టు సైతం సూచించిందన్నారు. అయినప్పటికీ రాష్ట్రపతి గానీ, కేంద్రం గానీ బిల్లును ఆమోదిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? స్పష్టతనివ్వలేదన్నారు. అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగలు ఇస్తామని ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ప్రకటన చేయించారని, అధికారంలోకి వచ్చి 18 నెలలు అయినా ఉద్యోగ క్యాలెండర్ ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న మల్లేశ్ను యువతి బంధువులు హత్య చేశారని, కులం, పరువు పేరుతో రాష్ట్రంలో ఇప్పటివరకు 42 హత్యలు జరిగాయన్నారు.
ఇటువంటి దారుణ ఘటనలు జరగకుండా ప్రభుత్వం స్పందించి కులాంతర వివాహ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ఆగస్టు, సెప్టెంబర్లో గ్రామాలు, బస్తీల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిషారానికి ఆందోళన చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇండ్ల స్థలాలు లేని బాధితులు 30 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వ గుర్తించి 120 గజాల స్థలం కేటాయించాలన్నారు. వ్య వసాయ కూలీలకు రూ.12 వేలు, మహిళలకు రూ.2,500, రాజీవ్ యువ వికాస పథకం అమలు ఊసే ఎత్తడం లేదని విమర్శించారు.
కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని మార్చి 10 నుంచి 12 గంటల పని విధానాన్ని అమలు చేసి శ్రమ దోపిడీకి పాల్పడుతుందన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, నారి అయిలయ్య, డబ్బికార్ మల్లేశ్ , బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, ప్రభావతి, వెంకటేశ్వర్లు, ఎండీ హాశం, చిన్నపాక లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.