ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజా తీర్పు నేడు వెలువడనున్నది. గెలిచేదెవరో.. ఓడేదెవరో అన్నది తేలిపోనున్నది. సర్వత్రా నెలకొన్న ఉత్కంఠకు ఆదివారం మధ్యాహ్నం తర్వాత తెర పడనున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డిన అభ్యర్థుల భవితవ్యం ఏమిటో తెలిసిపోనున్నది. నవంబర్ 30న శాసనసభ ఎన్నికలను నిర్వహించిన ఈసీ.. ఆదివారం నాటి కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలు ఉండగా నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూర్, బోధన్, బాల్కొండ, బాన్సువాడ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించనున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ సెగ్మెంట్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపును కామారెడ్డి ఎస్పీ కార్యాలయం పక్కనే ఉన్న స్ట్రాంగ్ రూమ్ వద్ద చేపట్ట నున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు చేపట్టనున్నారు. ఒక్కో రౌండ్లో 14 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహిస్తారు. మరోవైపు బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని గులాబీ శ్రేణులు ధీమాతో ఉన్నాయి.
నిజామాబాద్, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉత్కంఠ వీడనున్నది. ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజా తీర్పు నేటి మధ్యాహ్నంతో తేలనున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారన్నది తేలిపోనున్నది. ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటరు మహాశయుడి తీర్పు ఆదివారంతో వెలువడనున్నది. కౌంటింగ్ వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం తొమ్మిది నియోజకవర్గాలున్నాయి. ఇందులో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బోధన్, బాల్కొండ, బాన్సువాడ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేశారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలకు సంబంధించి అడ్లూర్ రోడ్డులో కామారెడ్డి ఎస్పీ ఆఫీస్ పక్కనే స్ట్రాంగ్ రూమ్ వద్ద ఫలితాల వెల్లడికి పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఫలితాల వెల్లడి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా కేంద్ర బలగాలతోపాటు రాష్ట్ర పోలీస్ శాఖ గట్టి బందోబస్తును చేపడుతున్నది. మూడంచెల భద్రత వలయంలో ఓట్ల లెక్కింపును చేపట్టబోతున్నారు. ఎన్నికల సంఘం అనుమతించిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు మాత్రమే లెక్కింపు కేంద్రాలకు అనుమతి ఉంది. మిగిలిన వారంతా కౌంటింగ్ ప్రాంతానికి దూరంలోనే ఉండాల్సి ఉంటుంది.
ఆర్మూర్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు 16రౌండ్లలో తేలనున్నది. బోధన్ ఎన్నికల ఫలితానికి 18రౌండ్లు, బాన్సువాడ నియోజకవర్గం ఫలి తం 19రౌండ్లు, నిజామాబాద్ అర్బన్ 21 రౌండ్లు, నిజామాబాద్ రూరల్ 21 రౌండ్లు, బాల్కొండ నియోజకవర్గం 18 రౌండ్లలో లెక్కించబోతున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో 266 పోలింగ్ బూత్లున్నాయి. ఇక్కడ 19 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. ఎల్లారెడ్డిలో 270 పోలింగ్ బూత్లు ఉండగా 20 రౌండ్లలో ఓట్లు లెక్కిస్తారు. జుక్కల్లో 255 పోలింగ్ బూత్లు ఉన్నందున 19 రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్మూర్ ఫలితమే తొందరగా రానున్నది. ఇక్కడ అన్ని నియోజకవర్గాల కన్నా ఆర్మూర్లో తక్కువ పోలింగ్ బూత్లు ఉండడమే కారణం. కౌంటింగ్ కోసం ఒక్కో పార్టీ నుంచి ఒక్కో ఏజెంట్ను కౌంటింగ్ హాల్లోకి అనుమతిస్తారు. ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఒక వీవీ ప్యాట్ యంత్రంలోని స్లిప్పులను లెక్కిస్తారు. లెక్కింపు ప్రక్రియ పూర్తి అయిన వెంటనే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి నివేదికలు పంపిస్తారు. కౌంటింగ్ నిర్వహణకు హాజరయ్యే పార్టీల ఏజెంట్లు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారి జారీ చేసిన గుర్తింపు కార్డులు తీసుకొని రావాల్సి ఉంటుంది. ఎన్నికల సిబ్బంది కూడా వారికి కేటాయించిన టేబుల్ వద్దనే విధులు నిర్వర్తించాలి. పక్క టేబుళ్ల వద్దకు వెళ్లేందుకు ఎలాంటి అనుమతి ఉండబోదు. కౌంటింగ్ అంతా సీసీటీవీ పర్యవేక్షణలో ఉంటుంది. ఇక్కడ జరిగే కౌంటింగ్ను రాష్ట్ర ఎన్నికల అధికారులు, పరిశీలకులు నిరంతరం పరిశీలిస్తారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, సర్వీస్ ఓట్లను ముందుగా లెక్కిస్తారు. ఈ ప్రక్రియ 8గంటలకు మొదలైతే 20 నుంచి 30 నిమిషాల్లో ఫలితం వెల్లడవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ తర్వాత సర్వీస్ ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. నిర్ణీత వ్యవధిలో పూర్తికాక పోయినా 8.30గంటలకు ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించే అవకాశాలుంటాయి. అయితే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయితే కానీ ఈవీఎంల రౌండ్ల ఫలితాలను అధికారికంగా ప్రకటించడానికి వీల్లేదు. సంబంధిత రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలోనే పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు టేబుళ్లకు అదనంగా పోస్టల్ బ్యాలెట్ల కోసం ఆర్వో వద్ద ప్రత్యేక టేబుల్ను ఏర్పాటు చేస్తారు. ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపునకు నియోజకవర్గానికి 14 టేబుళ్లపై సహాయకులు పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను క్రమపద్ధతిలో తీసుకొచ్చి టేబుళ్లపై ఉంచుతారు. సూపర్వైజర్ వాటిపై ఉండే రిజల్ట్ మీటను నొక్కి పార్టీల వారీగా నమోదైన ఓట్ల లెక్క నమోదు చేసుకుంటారు. మైక్రో అబ్జర్వర్ వాటిని పట్టికలో పొందుపర్చి ఆర్వోకు అందిస్తారు. అన్ని టేబుళ్ల లెక్కలను కలిపితే ఓ రౌండ్ ఫలితం వచ్చినట్లు పరిశీలన తర్వాత సంబంధిత ఆర్వో, పరిశీలకులు ఫలితాన్ని వెల్లడిస్తారు. చివరి రౌండ్ ఫలితం పూర్తయ్యాక అభ్యర్థి గెలుపును ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటిస్తుంది. రిటర్నింగ్ అధికారి స్వయంగా గెలుపొందిన వ్యక్తికి ధృవీకరణ పత్రాన్ని అందిస్తారు.
నవంబర్ 30న జరిగిన పోలింగ్లో నిజామాబాద్ జిల్లాలోని 6నియోజకవర్గాల్లో మొత్తం 1549 పోలింగ్ స్టేషన్లలో 13లక్షల 94వేల 986 మంది ఓటర్లు ఉండగా 74.68శాతం పోలింగ్ నమోదైంది. 10లక్షల 41వేల 775 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కామారెడ్డి జిల్లాలో మూడు నియోజకవర్గాలకు 791 పోలింగ్ స్టేషన్లలో 6లక్షల 72వేల 953 మంది ఓటర్లుండగా 79.92శాతం పోలింగ్ నమోదైంది. 5లక్షల 37వేల 794 మంది ఓటు వేశారు. పోలింగ్ ముగియడంతో కౌంటింగ్ ప్రక్రియతో అసెంబ్లీ ఎన్నికల పర్వం చివరి అంకానికి చేరుకున్నది. అత్యంత కీలకమైన ప్రక్రియ ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. అవసరమైన అధికారులు, సిబ్బందికి విధుల కేటాయింపు పూర్తయ్యింది. ఆదివారం వేకువ జామున 5గంటలకే ఉద్యోగులు, సిబ్బంది లెక్కింపు కేంద్రాలకు చేరుకోవాలని ఎన్నికల విభాగం ఆదేశించింది. ఓట్ల లెక్కింపుపై గంటపాటు ఉద్యోగులకు దిశానిర్దేశం చేసి, అనంతరం అభ్యర్థుల సమక్షంలో ఉదయం 8గంటలకు ప్రక్రియ ప్రారంభిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఒక్కో నియోజవకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేసి ఈవీఎంల్లో నమోదైన ఓట్లను లెక్కిస్తామని అధికారులు చెబుతున్నారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు అదనపు టేబుళ్లు ఉంటాయి. టేబుళ్ల వద్ద ఓ సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు, ఓ మైక్రో అబ్జర్వర్ ఉంటారు. అభ్యర్థులు తమ ఏజెంటును కూడా ఉంచొచ్చు. వీరు ఇచ్చే లెక్కలకు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్వో), కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు పరిశీలన చేసి సరిచూస్తారు. సవ్యమేనని నిర్ధారించుకున్నాక ఆ రౌండ్కు సంబంధించిన ఫలితాన్ని ప్రకటిస్తారు. వేగంగా ఫలితాల వెల్లడి జరిగేలా కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి చర్యలు తీసుకున్నది.
ఓటరు ఈవీఎంను నొక్కగానే పక్కనున్న వీవీ ప్యాట్లో సదరు అభ్యర్థి గుర్తుతో ముద్రితమైన చీటి పడడం ఓటేసిన వారంతా గమనించే ఉంటారు. నియోజకవర్గంలోని ఏవేని ఐదు పోలింగ్ కేంద్రాల వీవీ ప్యాట్ల చీటిలను చివర్లో లెక్కిస్తారు. ఈవీఎం, వీవీప్యాట్ల లెక్కను సరిపోల్చేందుకు అలా చేస్తారు. కొన్ని పోలింగ్ కేంద్రాల ఈవీఎంలు ఫలితాల వెల్లడిలో మొరాయిస్తే అప్పుడు వీవీప్యాట్ల ఓట్లను(మొదటి స్థానంలో అభ్యర్థికి, రెండో స్థానంలో అభ్యర్థికి మధ్య తక్కువ ఓట్ల వ్యత్యాసం ఉన్నప్పుడు) లెక్కిస్తారు.
ఓట్ల లెక్కింపు కోసం కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయినప్పటి నుంచి ఈవీఎంలకు జిల్లా ఎన్నికల అధికారుల సూచనలతో పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. వీటిని పదిలపర్చిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ బందోబస్తు ఉండేలా చర్యలు తీసుకున్నారు. రేయింబవళ్లు సీసీ కెమెరాల పర్యవేక్షణతోపాటు స్ట్రాంగ్ రూమ్ దరిదాపుల్లోకి ఎవ్వరినీ రానివ్వకుండా చూశారు. నేడు వెల్లడించే ఫలితాల ప్రక్రియలో భాగంగా ప్రతి రౌండ్కు అవసరమైన ఈవీఎం యంత్రాల్ని వీవీ ప్యాట్లను లెక్కింపు ప్రాంతానికి తరలించేలా, ప్రతి రౌండ్కూ సరిపడా సిబ్బందిని నియమించారు. ఇలా అధికారుల పర్యవేక్షణలో తీసుకొచ్చిన వాటిని యథావిధిగా లెక్కింపు తర్వాత కూడా పక్కా పర్యవేక్షణలో వాటిని భద్రపరిచేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం లెక్కింపు బృందం సహా పర్యవేక్షణ సిబ్బందికి పలు దఫాలుగా శిక్షణ పూర్తయ్యింది.
ఖలీల్వాడి, డిసెంబర్ 2: శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో భాగంగా కౌంటింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను శనివారం ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పూర్తిచేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్ఐసీ హాల్లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ సెకండ్ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ సిబ్బంది రెండో విడుత ర్యాండమైజేషన్ ప్రక్రియను పరిశీలకుల సమక్షంలో నిర్వహించారు. ఆరు సెగ్మెంట్లకు సంబంధించి మొత్తం 122 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 131 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 123 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని, వీరికి ఇప్పటికే పలు విడుతలుగా మాస్టర్ ట్రైనర్లతో కౌంటింగ్ నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు పరిశీలకుల దృష్టికి తెచ్చారు. రిజర్వు సిబ్బంది సైతం అందుబాటులో ఉంటారన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తూ రౌండ్ల వారీగా కౌంటింగ్ నిర్వహించేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నామన్నారు. మూడో విడుత కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ ఆదివారం ఉదయం 5 గంటలకు రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, సీపీవో బాబూరావు, ఎన్ఐసీ అధికారి రవికుమార్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.