స్వయం పాలనలో సర్కారీ వైద్యం మెరుగు పడింది. ఆపదలో వచ్చే వారికి ప్రభుత్వ దవాఖానల్లో అత్యాధునిక చికిత్స లభిస్తున్నది. కార్పొరేట్ సేవలతో రోగుల ప్రాణాలకు అక్కడ భరోసా దక్కుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ దవాఖానల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. సరైన వసతులు, వైద్యులు లేక వాటిపై ప్రజల్లో నమ్మకం పోయింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్ ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేశారు. దశల వారీగా అన్ని వసతులూ సమకూర్చారు. ఫలితంగా ప్రభుత్వ దవాఖానల్లో అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. అరుదైన, ఖరీదైన వైద్య చికిత్సలు కూడా నిజామాబాద్ జిల్లా దవాఖానలో లభిస్తున్నాయి. రూ.లక్షల విలువ చేసే మోకాలి చిప్పల మార్పిడి కూడా ఫ్రీగా చేస్తున్నారు. నిత్యం 1500 మందికి పైగా జీజీహెచ్లో ఓపీ సేవలు అందుతున్నాయి. రోగుల కోసం సాయంకాలం వేళా ఓపీ సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని మిగతా దవాఖానల్లోనూ వసతులు మెరుగు పడ్డాయి. అన్నింటా ఆక్సిజన్ పడకలు సైతం అందుబాటులోకి వచ్చాయి. ప్రాభవం కోల్పోయిన ఆ వైద్యశాలలే ఇప్పుడు రోగులతో కిటకిటలాడుతున్నాయి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాడుకున్న జనాలే.. పోదాం పద ప్రభుత్వ వైద్యశాలలకే అని పాడుకునే పరిస్థితులు వచ్చాయి.
రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నది. నిరుపేదలకు సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటుండడంతో ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన పెట్టింది పేరుగా నిలుస్తున్నది. అతి క్లిష్టమైన శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించడంలో జిల్లా దవాఖానలో మొదటి స్థానంలో నిలిచింది. అదే విధంగా ప్రతి రోజు 1000 నుంచి 1500 మంది వరకు ఓపీ సేవలను వినియోగించుకుంటున్నారు. పేదలకు వైద్య సేవలు మరింత చేరువ చేసే విధంగా సాయకాలం ఓపీ సేవలను సైతం ఇటీవలే ప్రారంభించారు. ప్రస్తుతం సాయంకాలం వంద మందికిపైగా ఓపీ సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన కొవిడ్ సమయంలోనూ వైద్యులు ఎనలేని సేవలు అందించారు. అనేక క్లిష్టమైన సర్జరీలు, అత్యధిక ప్రసవాలు చేయడంలో ముందు వరుసలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వ దవాఖానలో అందుతున్న సేవలపై ప్రశంసల వర్షం కురిపించారు. అన్ని విభాగాల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడానికి అవసరమైన పరికరాలను ప్రభుత్వం సకూర్చుతున్నది.
నిజామాబాద్ జిల్లాలో కరోనా సోకిన గర్భిణులకు వైద్యులు ప్రాణాలకు తెగించి ప్రసవాలు చేశారు. జిల్లా దవాఖానలో 270 మంది కొవిడ్ బారిన పడిన మహిళలకు మేమున్నామంటూ ఇక్కడి వైద్యులు ప్రసవాలు చేసి శభాష్ అనిపించుకున్నారు.
పెరిగిన ప్రసవాల సంఖ్య
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ప్రసవాల సంఖ్య పెంచడం, గర్భిణులకు పౌష్టికాహారం అందించడంలో ఆశ వర్కర్లు విశేషమైన కృషి చేస్తున్నారు. జిల్లా ప్రభుత్వ దవాఖానలో జనవరి నుంచి ఇప్పటి వరకు 3054 మంది కాన్పులు చేయించుకున్నారు. ప్రైవేటు దవాఖానల్లో 2798 మంది డెలివరీ అయ్యారు. అంటే ప్రభుత్వ దవాఖానలో 52 శాతం, ప్రైవేటు దవాఖానలో 48 శాతం ప్రసవాలు అయ్యాయి.
మోకాళ్ల చిప్పల మార్పిడి విజయవంతం
ఇటీవలే ప్రభుత్వ దవాఖానలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మోకాళ్ల చిప్ప మార్పిడి విభాగాన్ని ఏర్పాటు చేశారు. లక్షల రూపాయలు ఖర్చయ్యే ఆపరేషన్లను ఉచితంగా నిర్వహిస్తున్నారు. అందులో ముగ్గురికి మోకాళ్ల చిప్ప మార్పిడి విజయవతంగా పూర్తి చేసి ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకున్నారు. మాక్లూర్ మండలం సింగంపల్లి తండాకు చెందిన నీలాబాయి, గొట్టుముక్కులకు చెందిన లలిత, ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామనికి చెందిన గంగమణికి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఇదే ఆపరేషన్ ప్రైవేటు దవాఖానలో నిర్వహిస్తే సుమారు రూ.3 నుంచి 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు ఉచితంగా ఆపరేషన్లు చేయించింది.
డయాగ్నోస్టిక్ హబ్ ఏర్పాటు..
ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం కోసం వచ్చే వారికి కొండంత భరోసా లభిస్తున్నది. ఆయా వ్యాధులతో బాధపడుతున్న వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే ఆర్థిక భారం పడేది. ప్రభుత్వ వైద్యశాలల్లో సరైన రోగ నిర్ధారణ పరికరాలు లేకపోవడంతో ప్రైవేటు కేంద్రాల బాట పట్టాల్సిన పరిస్థితి ఉండేది. వేలాది రూపాయలు వెచ్చిస్తే గానీ పరీక్షల ఫలితాలు తెలిసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం 57 రకాల పరీక్షలను ఉచితంగా చేయించడానికి ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్ర దవాఖానలో రోగ నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. గత ఏడాది జూన్ 9న ప్రారంభమైన డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా వేలాది మందికి లబ్ధి చేకూరుతున్నది. మొత్తం 42 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక వైద్యశాలల నుంచి వచ్చే నమూనాలను డయాగ్నోస్టిక్ సెంటర్లో పరీక్షించి వాటి ఫలితాలను ఆయా దవాఖానలకు పంపిస్తున్నా రు. తద్వారా ప్రైవేటు డయాగ్నోస్టిక్ దోపిడీకి చెల్లుచీటి పడింది. రోజుకు సగటున 230 నుంచి 250 మంది రోగులకు సంబంధించిన వివిధ రకాల పరీక్షల కోసం నమూనాలు డయాగ్నోస్టిక్ సెంటర్కు వస్తున్నాయి.
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ వైద్యం
ప్రైవేటులో లక్షలు ఖర్చుపెట్టినా భరోసా లేని వారికి ప్రభుత్వ దవాఖానలో ప్రాణం పోస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కరోనా వేళ వైద్యులు అందించిన సేవలు వెలకట్టలేనివి. 530 బెడ్లు, ఆక్సిజన్ కాన్సట్రేటర్లు అందుబాటులో ఉంచి ప్రజల ప్రాణాలకు వైద్యుల ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా అన్ని సదుపాయాలను సమాకూర్చింది. ప్రజలను కాపాడేందుకు వైద్యులు ఎంతో కృషి చేశారు. ఎమ్మెల్సీ కవిత, మంత్రి ప్రశాంత్ రెడ్డి నిరంతర కృషితో కరోనా నుంచి వేలాదిమంది కోలుకున్నారు. అత్యంత ఖరీదైన మందులను ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వ దవాఖానలో ప్రజల కోసం ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా కృషి చేశారు
ప్రైవేటు కన్నా ప్రభుత్వ దవాఖాన మేలు
ప్రైవేటు దవాఖాన కన్నా ప్రభుత్వ దవాఖానలో మంచిగా చూస్తున్నారు. మంచి వైద్యం కూడా అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు రోగులను పరిశీలించి మెరుగైన చికిత్సలు చేస్తున్నారు.
-సావిత్రి, నాగారం
ప్రభుత్వ దవాఖానలోనే అన్ని వసతులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ దవాఖానలో అన్ని వసతులను ఏర్పాటు చేసింది. ఇటీవలే సాయకాలం ఓపీ ప్రారంభించాం. మోకాళ్ల చిప్పల మార్పిడి విజయవతంగా పూర్తి చేశాం. అన్ని విభాగాలకు చెందిన శస్త్ర చిక్సితలను ప్రజలకు అందిస్తున్నాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. రోజుకు రెండు సార్లు శానిటేషన్ చేయిస్తున్నాం.
-ప్రతిమారాజ్, సూపరింటెండెంట్, జీజీహెచ్
పైసా ఖర్చులేకుండా ఆపరేషన్ చేశారు
మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బందులు పడ్డా. ప్రైవేటు దవాఖానలో డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు. మోకాళ్ళ చిప్పలు మార్చు కోవాలంటే హైదరాబాద్కి వెళ్లాలని అన్నారు. కానీ ప్రభుత్వ దవాఖానలో పైసా ఖర్చులేకుం డా ఆపరేషన్ చేశారు.
-నీలాబాయి, మాక్లూర్
ప్రభుత్వ దవాఖానలోనే బాగుంది
బాన్సువాడ నుంచి 104లో వచ్చాం. అనుకున్న సమయానికి చేరుకున్నాం. వైద్యులు అందుబాటులో ఉండి డెలివరీ చేశారు. చాలా బాగుంది. ప్రభుత్వం ఇంత పెద్ద దవాఖాన నిజామాబాద్లో ఏర్పాటు చేయడం మాకు చాలా ఉపయోగ పడుతున్నది.
-జయశ్రీ, బాన్సువాడ
సాయంకాలం ఓపీతో ఎంతో మేలు
ప్రభుత్వ దవాఖానలో సాయంకాలం ఓపీ పెట్టడంతో మాలాంటి వాళ్లకు డబ్బులు ఆదా అవుతాయి. నా కాలికి దెబ్బ తాకింది. అందుకే వైద్యం కోసం వచ్చా. ఇక్కడ సేవలు బాగున్నాయి. మందు లు కూడా ఇస్తున్నారు.
-ముజీబ్, హైమద్పుర కాలనీ, నిజామాబాద్.