మాక్లూర్(నందిపేట్), జనవరి 9 : ప్రతి పల్లెలో అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా సాగుతుండగా, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. నందిపేట్ పట్టణంలో పద్మశాలి, గౌడ, కుర్మ, మున్నూరుకాపు సామాజిక వర్గాల వారి కోసం చేపట్టిన కమ్యూనిటీ ఫంక్షన్హాళ్లు, ముస్లిముల కోసం చేపట్టిన షాదీఖానా నిర్మాణ పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఫంక్షన్ హాళ్ల నిర్మాణ కమిటీలకు పలు సూచనలు చేశారు. అనంతరం జీవన్రెడ్డి మాట్లాడుతూ రెండెకరాల భూమిలో రూ. 50 లక్షల వ్యయంతో పద్మశాలి సంఘానికి, మూడెకరాల భూమిలో రూ.50లక్షలతో కుర్మ సంఘానికి, పదెకరాల భూమిలో రూ.50లక్షలతో గౌడ సామాజిక వర్గానికి ఫంక్షన్ హాళ్లు నిర్మిస్తున్నట్లు వివరించారు. నందిపేట్లో వివిధ సామాజిక వర్గాల వారికి ఆరు ఫంక్షన్ హాళ్ల నిర్మాణం చేపట్టామని, మార్చి నాటికి పూర్తి చేస్తామన్నారు. ఇంకేమైనా నిధులు అవసరమైతే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయిస్తానని హామీనిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ప్రగతిరథ సారథిగా దారి చూపుతోందన్నారు. మన రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేవని జీవన్రెడ్డి ప్రశ్నించారు. నేడు దేశమంతా తెలంగాణ వైపు చూస్తుందని, కేసీఆర్ నాయకత్వం కావాలని దేశప్రజలు కోరుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ అంటేనే బడుగు, బలహీన వర్గాలు, రైతుల సంక్షేమం, తెలంగాణ రాష్ట్ర ప్రగతికి కర్త, కర్మ, క్రియ అన్ని కేసీఆరే అని పేర్కొన్నారు. అసాధ్యమనే పదం కేసీఆర్ డిక్షనరీలోనే లేదన్నారు. సంపద పెంచి పేదలకు పంచుతున్న మనసున్న నేత కేసీఆర్ అని కొనియాడారు. ఎమ్మెల్యే వెంట మేరు సంఘం సభ్యులు, నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.