ఖలీల్వాడి, జూన్ 11: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుందర నగరంగా మారిన నిజామాబాద్ నేడు అధ్వానంగా మారింది. పచ్చదనంతో కళకళలాడిన నగరం నేడు కళా విహీనంగా తయారైం ది. పాలన గాడి తప్పింది…అభివృద్ధి కుంటుపడింది. నగరాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సుందరీకరణ పనులు చేపట్టారు. దీంతో పదేండ్ల కాలంలో నిజామాబాద్ నగరం రూపురేఖలు మారిపోయాయి. అప్పటి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా తెలంగాణ తొలిసీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.
మున్సిపల్ కా ర్పొరేషన్ నూతన భవనం, ఆధునిక వైకుంఠ ధామా లు, విద్యుత్ భవనం, ఇందూరు కళాభారతి , ఐటీ హబ్, న్యాక్ బిల్డింగ్ నిర్మించారు. ఆలయాలకు ప్రత్యే క నిధులు కేటాయించారు. ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నగర అభివృద్ధిపై నిర్లక్ష్యం నెలకొన్నది. పచ్చదనాన్ని కాపాడడానికి కనీస చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా సెంటర్ మీడియన్ పనులు పూర్తిచేయించారు. పచ్చని మొక్కలు నాటించి వాటి పర్యవేక్షణ బాధ్యతలను కార్పొరేషన్కు అప్పజెప్పారు. విద్యుత్ వెలుగులతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. నగరవాసులకు ఆహ్లాదం పంచడానికి మినీ ట్యాంక్ బండ్ నిర్మించి అందుబాటులోకి తెచ్చారు. ఏండ్లుగా కొనసాగిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తిచేయించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారింది. నగర అభివృద్ధిపై నిర్లక్ష్యం నెలకొన్నది. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు ఎలా ఉండే నగరం ఎలా అయ్యిందంటూ నగరవాసులు నిట్టూరుస్తున్నారు. 70 ఏండ్లలో జరగని అభివృద్ధి పదేండ్లలో చేసి చూపించి, సుందర నగరంగా తీర్చిదిద్దిన బిగాల గణేశ్పై అధికారపార్టీ నాయకులతోపాటు ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అర్బన్ ఎమ్మెల్యేకు కనీసం మొక్కల సంరక్షణ కూడా చేతకావడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొక్కలకు నీళ్లు అందించనివారు నగరాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ పాలనలో సుందరంగా ఉన్న నగరంలో రేవంత్ పాలనలో అధ్వానంగా మారిందని మండిపడుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో గతంలోఎన్నడూ లేని విధంగా నిజామాబాద్ను అభివృద్ధి చేశాం. ప్రకృతి ఉట్టిపడేలా నగరమంతా డివైడర్లు నిర్మించి పచ్చని మొక్కలను నాటాం. నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నగర అభివృద్ధిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. బీజేపీ ఎమ్మెల్యే నగర అభివృద్ధిని గాలికి వదిలేసి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. రాజకీయ కుట్రలో భాగంగా నగర అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తున్నారు.
-బిగాల గణేశ్గుప్తా , నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే