శక్కర్నగర్, అక్టోబర్ 10: ప్రజలకు పోలీసు చట్టాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని బోధన్ ఏసీపీ కేఎం కిరణ్ కుమార్ అన్నారు. మంగళవారం బోధన్ పట్టణంలోని గంజ్ప్రాంతంలో ఏసీపీ కిరణ్ కుమార్ నేతృత్వంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రజలు చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు. ముఖ్యంగా యువత కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారుతున్నదని అన్నారు. వాహనాలు నడిపేవారు సంబంధిత వాహనాల డాక్యుమెంట్లతో పాటు హెల్మెట్ ధరించాలని సూచించారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వవద్దన్నారు. ఎన్నికల కోడ్ సందర్భంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. రూ.50 వేల కన్నా ఎక్కువగా డబ్బులు బయటికి తీసుకెళ్తే వాటికి సంబంధించిన ప్రతాలు ఉండాలని, లేని పక్షంలో సదరు డబ్బు, వాహనాన్ని పోలీసులు సీజ్చేస్తారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బోధన్ పట్టణ, రూరల్ సీఐలు బీడీ ప్రేమ్కుమార్, జి. శ్రీనివాస రాజు, పలువురు ఎస్సైలు, సిబ్బంది కాలనీవాసులు పాల్గొన్నారు.
మంథని గ్రామంలో తనిఖీలు
ఆర్మూర్, అక్టోబర్10: ఆర్మూర్ మండలంలోని మంథని గ్రామంలో ఏసీపీ జగదీశ్ చందర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ తిరుగుతూ ఇంట్లోని వ్యక్తుల వివరాలను సేకరించారు. వారి ఆధార్ కార్డులను పరిశీలించారు. సరైన ఆధారాలు చూపని 37 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ జగదీశ్ చందర్ మాట్లాడుతూ….గ్రామంలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే విధంగా ప్రజలకు ధైర్యాన్ని నింపుతూ పోలీసులు గ్రామంలో కవాతు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఎస్హెచ్వో సురేశ్బాబు, ఎస్సై అంజమ్మ , సిబ్బంది పాల్గొన్నారు.